హైదరాబాద్ టీడీపీలో ఆ ఒక్కడినీ వదలరా?

Update: 2016-02-11 06:23 GMT
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆరెస్ లో చేరిన తరువాత హైదరాబాద్ టీడీపీలో మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే. సాంకేతికంగా ఇద్దరు మిగిలినా అందులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తనకు తెదేపాతో సంబంధం లేదని ఇప్పటికే చెబుతున్నారు. దాంతో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ ఒక్కరే మిగిలినట్లయింది. దీంతో టీఆరెఎస్ ఆ శేషం కూడా ఉంచకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే... మాగుంట టీడీపీని వీడే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆయన్ను ఎలాగైనా టీఆరెస్ లోకి రప్పించేందుకు కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు కేసును తవ్వి అందులో ఆయన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా సమాచారం.

ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నగరంలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు టీఆరెస్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే... హైదరాబాద్ టీడీపీలో మిగిలింది గోపీనాథ్ ఒక్కరే కావడంతో అది ఆయనేనని అనుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో ఇవ్వజూపిన డబ్బును సమకూర్చింది గోపీనాథ్ అని విచారణలో తేలిందట. దీంతో ఆయన్న అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే... టీఆరెస్ లో చేరనందుకు ఇది కక్ష సాధింపా.. లేదంటే ఈ రకంగా బెదిరించి లొంగదీసుకుని చేర్చుకోవాలన్న ఎత్తుగడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నందుకు మాగుంటకు కష్టాలు మొదలవుతున్నట్లుగా ఉంది.
Tags:    

Similar News