థ‌ర్డ్ ఫ్రంట్ కాదు..మాది ఫ‌స్ట్ ఫ్రంట్

Update: 2018-03-10 14:55 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌యుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోమారు దేశ రాజ‌కీయాల‌పై సంచ‌న‌ల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్  ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్‌పై ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏకకాలంలో ఇటు ఢిల్లీని అటు ఆంధ్రుల‌ను ఫిదా చేసే మాట‌లు చెప్పారు. భారతదేశం రెండు పార్టీల వ్యవస్థ కాదు...రెండు పార్టీల మధ్య పోరాటం కాదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పరిస్థితులో..ఎప్పుడు ఎన్నికలు వచ్చిన  ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని రాజకీయంగా భావిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు.

త‌మ నాయ‌కుడు చేసింది థర్డ్ ఫ్రంట్ కాదు ఫస్ట్ ఫ్రంటే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. భారత్ రెండు పార్టీల వ్యవస్థ కాదన్న మంత్రి.. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అధికారమంతా ఢిల్లీలో కేంద్రీకృతమైంది.. అదిసరికాదన్నారు. అందుకే కేసీఆర్ కొత్త చర్చ తీసుకువచ్చారు.. అది మంచి పరిణామాలకే దారి తీస్తోందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా రాష్ర్టానికి అదనంగా రాలేదు.. రావాల్సిన నిధులే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇదే జరిగింది.. అందుకే టీడీపీ బయటికి వచ్చింది అనుకుంటానని మంత్రి తెలిపారు. బీజేపీ ఎందుకు మిత్రపక్షాలను కోల్పోతుందో వారే ఆలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించే పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు.

ఇదే సంద‌ర్భంగా ఏపీ రాజ‌కీయాల‌ను ముఖ్యంగా ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొల‌గ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. `విభ‌జ‌న చ‌ట్టం మిన‌హా తెలంగాణకు మాత్రం ఒక్కటైనా ఇవ్వలేదు. ఒక్క కొత్త సంస్థా రాలేదు. మా దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు నివేదించాం. ప్రధానితో పాటు అనేకమంది మంత్రులను కలిసి విన్నవించాం. మార్పులేదు. మాకెదురైన అనుభవమే ఆంధ్రామిత్రులకు కూడా ఎదురైనట్టుంది. అందుకే వారు బయటకు వచ్చారు. నిజంగా చెప్పాలంటే.. ఎన్డీయేకు ఆ కూటమిలో ఎవరూ మిగలలేదు. చంద్రబాబు బయటకు వచ్చాక శివసేన వైదొలిగిన తర్వాత ఎవరూ లేరు. బలహీన పడ్డ అకాళీదళ్‌ , భాజపా తప్ప ఎన్డీయేలో ఎవరూ లేరు. అందువల్ల కేంద్రం పునరాలోచించుకోవాలి. కూటమి నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారో ఆలోచించాలి’’ అని కేటీఆర్ పంచ్ వేశారు.
Tags:    

Similar News