వాళ్లను కార్లో తీసుకెళ్లిన కేటీఆర్

Update: 2016-11-27 04:46 GMT
అధికారం అనుబంధాల్నిమార్చేస్తుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పుష్కరానికి పైగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన మలి ఉద్యమాన్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ ఎస్ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు దాన్నో ఉద్యమ పార్టీగానే చూసే వారు. సెలబ్రిటీలు మొదలు కొని పలు రంగాల ప్రముఖుల వరకూ అందరూ టచ్ మీ నాట్ అన్నట్లే ఉండే వారే తప్పించి.. అంతకు మించిన అనుబంధం అస్సలు ఉండేది కాదు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సైతం రాజకీయ నేతలతో.. ఉద్యమకారులతో.. సామాజిక వేత్తలు.. కొద్ది మంది పారిశ్రామికవేత్తలతో సంబంధాలు ఉండేవి తప్పించి ప్రముఖులతో రాసుకుపూసుకు తిరిగిన వైనం అస్సలు కనిపించదు. ఆ మాటకు వస్తే ఆయనే కాదు.. ఆయన కుమారుడు కమ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ కు సైతం సెలబ్రిటీలతో స్నేహ సంబంధాలు అంతగా ఉండేవి కావు. ఒకే ఏజ్ గ్రూప్ అయినా.. ఎవరికి వారుగా ఉండేవారు.

కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణలో పవర్ మొత్తం సెంట్రలైజ్ అయి.. కేటీఆర్ ఇంట్లో పోగుపడిన సంగతి తెలిసిందే. అంతే.. అప్పటివరకూ అంటీముట్టనట్లుగా ఉండే సెలబ్రిటీలకు కేటీఆర్ తో దోస్తానా అవసరమైనట్లుగా చెబుతారు. అందుకు తగ్గట్లే.. తర్వాతి రోజుల్లో సినీ రంగ ప్రముఖులతో.. క్రీడా ప్రముఖులతో.. సెలబ్రిటీలతో కేటీఆర్ స్నేహ సంబంధాలు మెరుగవ్వటమే కాదు.. అవి ఎంత సన్నిహితంగా మారిపోయింది ఈ రోజు జరిగిన సీన్ ఒకటి చూస్తే అర్థమవుతుంది.

సిటీలో నిర్వహిస్తున్న10కే రన్ లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆయన వచ్చారంటే..  ఆయనకు దోస్తులుగా ఉన్న సెలబ్రిటీలు రాకుండా ఉండేవారా? మెగా హీరో రామ్ చరణ్.. రాశీఖన్నా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఇలా ప్రముఖులు చాలామందే వచ్చారు. అన్నింటి కంటే.. కేటీఆర్ తో సానియా.. రాంచరణ్.. రాశీ ఖన్నాదిగిన సెల్ఫీ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు.. కార్యక్రమం ముగిసినతర్వాత.. కేటీఆర్ కారులో రాం చరణ్.. సానియా.. రాశీఖన్నాలు వెళ్లటం కనిపించింది. తెలంగాణ రాజకీయాల్ని.. టీఆర్ఎస్ పార్టీని చూసే జర్నలిస్టులు చాలామంది.. ఈ సీన్ చూసినప్పుడు.. పవర్ ఎంత ‘పవర్ ఫుల్’ అన్న మదిలో మెదిలేలా చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News