మోడీ కోర్టులోకి బాల్‌ ను నెట్టిన కేటీఆర్‌

Update: 2017-08-14 09:49 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్ త‌న‌యుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్‌ లో చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని కీల‌క విష‌యంలో అభ్య‌ర్థిస్తున్నట్లుగానే స‌ద‌రు ట్వీట్ లో క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ... తేడా వ‌స్తే మోడీని బ‌ద్‌ నాం చేసేందుకే కేటీఆర్ ఈ అడుగువేశార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇంత‌కీ కేటీఆర్ ఏం చేశారంటే హైద‌రాబాద్ మెట్రోరైల్ విష‌యంలో మోడీజీని ఆహ్వానించిన విష‌యాన్ని ట్వీట్ చేశారు.

అధికారిక వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు కల త్వరలో నెరవేరనుంది. ట్రాఫిక్ ప్రతిబంధకాలు లేకుండా నిమిషాల్లో అల్లంతదూరం తీసుకెళ్లే మెట్రోరైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నవంబర్ చివర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభం కానుంద‌ని, దీనికి సంబంధించిన సంకేతాలు, ఆదేశాలు సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు మెట్రో సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మియాపూర్ నుంచి నాగోల్ వరకు ఏకబిగిన ప్రయాణికులకు సేవలందించేవిధంగా రెండుకారిడార్లను పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. కారిడార్ 1లోని మియాపూర్-అమీర్‌ పేట 13 కిలోమీటర్లు - కారిడార్ 3కి సంబంధించిన అమీర్‌ పేట-నాగోల్ 17 కిలోమీటర్ల మార్గాన్ని అనుసంధానించడానికి వీలుగా అమీర్‌ పేట్ స్టేషన్‌ ను త్వరితగతిన పూర్తిచేయనున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారక రామారావుకు సీఎం సూచించారు.

అయితే మెట్రో ప్రారంభోత్స‌వానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు్ సీఎం కేసీఆర్‌ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్ట‌ర్‌ లో ఓ పోస్ట్ పెట్టారు. ``మెట్రో ప్రారంభానికి సిద్ధ‌మైంది. ఈ నవంబ‌ర్‌లో మెట్రోను ప్రారంభించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (పీఎంఓ) నుంచి ప్ర‌ధాని రాక‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది`` అని ట్వీట్ చేశారు. అయితే ఈ విష‌యాన్ని రాజ‌కీయ‌వ‌ర్గాలు కొత్త‌కోణంలో చూస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌ధాన‌మంత్రికి వెళ్లిన విజ్ఞ‌ప్తిని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో స‌హ‌జంగా గోప్యంగా ఉంచుతార‌ని, కానీ మంత్రి కేటీఆర్ దానికి భిన్న‌మైన రూట్ ఎంచుకున్నార‌ని చెప్తున్నారు. తాము ప్ర‌ధానిని తెలంగాణ‌కు ఆహ్వానించామ‌ని ఇక రావ‌డం, రాక‌పోవ‌డం అనేది ఆయ‌న నిర్ణ‌యం అనే భావ‌న‌ను చాటిచెప్పేందుకు ఈ ట్వీట్ చేసిన‌ట్లుగా విశ్లేషిస్తున్నారు!
Tags:    

Similar News