చెప్పు తీసి కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి ...?

Update: 2022-03-02 12:30 GMT
ఎవరైనా ఆవేశానికి లోను అయితే చెప్పు తీసి కొడతాను అని అంటారు. మరీ ఎక్కువ ఆగ్రహం వస్తే తన చెప్పు తీసి తననే కొట్టుకుంటారు. ఇపుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అంతటి ఆవేశానికి లోను అయ్యరన్నమాట.

అంతేకాదు,  బాగా మండిపోతున్నారు అని కూడా చెప్పాలి. అయితే ఈ మంట కోపం అంతా ఎవరి మీద అంటే సొంత పార్టీ నేత మీదనే. ఆయనే  నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు. 2019 ఎన్నికల్లో ప్రసాదరాజు నర్సాపురం నుంచి గెలిచారు, తన వంతుగా పనిచేసుకుంటూ పోతున్నారు.

అయితే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకి, ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నది తాజా ఘటనతో బయటపడింది. సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న నాయకుడు కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు అంటారు. పార్టీ మాత్రం ప్రసాదరాజుకు టికెట్ ఇచ్చింది.

దాంతో ఆయన గెలుపునకు సుబ్బారాయుడు పనిచేశారు. మరో వైపు చూస్తే గత మూడేళ్ళుగా సుబ్బారాయుడుకు ఎలాంటి పదవీ హై కమాండ్ ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఒక వైపు ఉందని కూడా చెబుతారు.ఎమ్మెల్యే వర్సెస్ కొత్తపల్లిగా నర్సాపురం వైసీపీలో ఆధిపత్య పోరు సాగుతోంది.  సరిగ్గా ఇదే సమయంలో కొత్త జిల్లాల ఇష్యూ వచ్చింది. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అలా కాదు, నర్సాపురాన్ని ప్రకటించమని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయి.

ఈ విషయంలో అన్ని పార్టీలూ కూడా ఇదే తీరున పోరాట బాట పట్టాయి. వైసీపీలో కూడా నర్సాపురం జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ ఊపందుకుంది. అయితే ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు ఈ విషయంలో సరిగ్గా తన వాదన చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారు అన్నది మాజీ మంత్రి వర్గీయుల భావన. అందుకే తాజాగా ఆయన  నర్సాపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరం వద్దకు వచ్చి సడెన్ గా తన చెప్పు తీసి తాను కొట్టేసుకున్నారు.

ఒక అసమర్ధ ఎమ్మెల్యేను నర్సాపురం నుంచి గెలిపించినందుకు, ప్రజల వద్దకు వచ్చి ఓట్లేయమని నాడు కోరినందుకు మన్నించాలని ఆయన ఈ పని చేశారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ప్రసాదరాజు వర్గీయులు అంటున్నారు. అన్ని చోట్లా ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి.

మరి అక్కడ జిల్లాలను తేలేని వారిని అసమర్ధులు గా అంటారా అని రాజు గారి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నర్సాపురంలో రెండు వర్గాల మధ్య పోరు రాజుకుంది అని చెప్పాలి. ఇక కొత్తపల్లి తనదైన కొత్త రాజకీయానికి తెర తీశారు అంటే వైసీపీలో కూడా ది పెద్ద చర్చగా ఉంది మరి.
Tags:    

Similar News