ధర్మశ్రీకి జగన్ షాకింగ్ గిఫ్ట్... ?

Update: 2021-10-23 00:30 GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నెలల తరువాత విశాఖ వస్తున్నారు. ఆయన ఒక వైపు అధికార కార్యక్రమాలలో పాలుపంచుకుంటూనే మరో వైపు తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రెండవ కుమార్తె వివాహానికి హాజరవుతున్నారు. వైఎస్ జగన్ పెళ్ళికి వస్తున్నారు అంటే విశేషమే అయినా వచ్చిన వారు గిఫ్ట్ కూడా వెంటపట్టుకుని వస్తారు కదా, అది సంప్రదాయం కదా అన్న మాట కూడా ఉంది. మరి ధర్మశ్రీకి జగన్ ఏ బహుమతి ఇస్తారు అన్నదే ఇక్కడ చర్చ. 2004లో తొలిసారిగా మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం ధర్మశ్రీ వైఎస్సార్ కి ఆయన కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు. ఆయన వైఎస్సార్ మరణానంతరం జగన్ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక 2019 నాటికి ఆయన టీడీపీ కోటను బద్ధలు కొట్టి భారీ విజయం సాధించారు. మంచి మాటకారిగా ధర్మశ్రీకి గుర్తింపు ఉంది. జగన్ కి కూడా ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న ధర్మశ్రీ వైసీపీ అధికాంలోకి రావడంతోనే మంత్రి పదవిని కోరుకున్నారు. అయితే జగన్ ఇచ్చిన మాట మేరకు ముందుగా అవంతి శ్రీనివాస్ ని మంత్రిని చేశారు. ఇపుడు రెండున్నరేళ్ళు పూర్తి కావస్తూండడంతో విస్తరణ అశలు అందరిలో ఉన్నాయి. కరణం ధర్మశ్రీ ఈసారి తప్పకుండా తనకు చాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

రూరల్ జిల్లాకు చెందిన బలమైన నేత ధ‌ర్మశ్రీకి మంత్రి పదవి ఇస్తే మరో మారు రూరల్ జిల్లా అంతా వైసీపీకి సానుకూల పవనాలు వీస్తాయన్న లెక్కలు ఉన్నాయి. అయితే అనకాపల్లికి చెందిన యువ నేత గుడివాడ అమరనాధ్ కూడా పోటీలో ఉన్నారు. చూస్తే అమరనాధ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత కావడం, ఇంకా రాజకీయంగా జూనియర్ కావడంతో ధర్మశ్రీకి ఈ తడవ మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఇబ్బంది ఉండదని కూడా అంటున్నారు. మరో వైపు ప్రస్తున మంత్రి అవంతిని తప్పించినా గుడివాడ కంటే ధర్మశ్రీకే ఆయన ఓటు కూడా వేస్తారని చెబుతున్నారు. మొత్తానికి ధర్మశ్రీ కూతురు పెళ్ళికి హజరవుతూనే ముఖ్యమంత్రి ఆయనకు షాకింగ్ గిఫ్ట్ నే వెంటబెట్టుకుని వచ్చారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.
Tags:    

Similar News