విజయసాయిరెడ్డి ని వరించిన మూడో పదవి - ఇది కీలకం

Update: 2019-06-22 14:08 GMT
వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్ పట్ల - పార్టీ పట్ల ఆయన చూపే లాయల్టీ జగన్ కి ఎంతో ఇష్టం. ఎన్నికల ఫలితాలు రోజు విజయసాయిరెడ్డి ని హగ్ చేసుకుని సాధించాం సాయి అంటూ పట్టలేని ఆనందంతో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని చూశాం. తన ఎదుగుదలకు కారణమైన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న జగన్ పార్టీకి కంచుకోటలా ఉండి కార్యకర్తలకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిన విజయసాయిరెడ్డి కి ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈరోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి ని నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్వర్వులు జారీ చేసింది. ఇది ఆయనకు దక్కిన మూడో పదవి - కీలక పదవి.

ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. దీని అధ్యక్ష పదవిని ధర్మాన కృష్ణదాస్ కు అప్పగించారు జగన్. ఇందులో మొత్తం 8 మంది కమిటీలు - అనుబంధ కమిటీలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఆ నిర్ణయం అనంతరం విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి అప్పజెప్పారు జగన్. వైసీపీ ఎంపీలను అందరినీ సమన్వయంతో నడిపించాల్సిన పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించారు జగన్. అంటే రాజ్యసభలో పార్టీకి నాయకత్వం వహించడంతో పాటు ఇరు సభల్లోనూ ఉన్న అందరు వైసీపీ ఎంపీలకు విజయసాయిరెడ్డి నాయకత్వం వహిస్తారు. ఇది అధికారిక రాజకీయ పదవి. పార్టీపరంగా కీలక పదవి. అసెంబ్లీ నాయకుడు జగన్ అయితే - పార్లమెంటు వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి అన్నట్లు. ఇక తాజాగా దక్కిన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవితో ఆయనను మూడు పదవులు వరించినట్లయ్యింది.
Tags:    

Similar News