గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేస్ ..జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు !

Update: 2020-05-20 05:15 GMT
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కేంద్రం నాలుగో దశ లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సందర్భంలో లాక్ డౌన్ నుండి మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  కేంద్ర ప్రభుత్వం.. రైళ్లు నడిపేందుకు కూడా సిద్దమవుతోంది. ప్రస్తుతం వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్‌ మాత్రమే తిరుగుతుండగా జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు నడపబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

200 నాన్- ఏసీ సెకండ్ రైళ్లు జూన్ 1వ తేది నుంచి తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఈ  రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ ‌ను విడుదల చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అయితే ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉండదని తెలిపింది. ఐతే ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది.

ఆ మధ్యన రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైళ్లను నడపడం వలన కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ సహా పలువురు ముఖ్యమంత్రులు తెలపడంతో.. జూన్ 30 వరకు ప్రయాణికులు బుక్‌ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ డబ్బులు మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News