భార‌త్ ముందు... అమెరికా బ‌లాదూరే!

Update: 2017-07-14 09:27 GMT
అగ్ర‌రాజ్యంగా కీర్తింప‌బ‌డుతున్న‌ అమెరికా ఇప్పుడు భార‌త్ ముందు చిన్న‌బోయింది. ప్ర‌తి అంశంలోనే త‌న‌దే పైచేయిగా ఉండాల‌ని భావించే అమెరికా... ఆ దిశ‌గానే అడుగులు వేస్తుంది. అంతేనా... ప్ర‌పంచానికే పెద్ద‌న్న‌గా, ప్ర‌పంచ పోలీస్‌గా కూడా ఆ దేశం కొడుతున్న ఫోజులు మ‌నంద‌రికీ తెలిసిన వైన‌మే. అయితే ఇప్పుడు ఆ దేశం భార‌త్ ముందు పోటీకి త‌ట్టుకోలేక రెండో స్థానానికి దిగ‌జార‌క త‌ప్పలేదు. అమెరికా రెండో స్థానానికి ప‌డిపోగా... భార‌త్ ఇప్పుడు ఆ దేశం నిన్న‌టిదాకా ఒడిసిప‌ట్టేసిన ఫ‌స్ట్ ప్లేస్‌ ను చేజిక్కించుకుని త‌న స‌త్తాను చాటింది. ఇదంతా కేవ‌లం ఒక్క అంశానికి చెందిన విష‌య‌మే అయినా... అమెరికా స్థాయిని అందుకునే విష‌యంలో భార‌త్ చూపుతున్న సత్తాకు ఇది నిద‌ర్శ‌న‌మ‌నే చెప్పాలి. ఇరు దేశాల మ‌ధ్య మైత్రీ బంధం బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో అమెరికాతో స‌రిస‌మానంగా ఎద‌గ‌డ‌మే కాకుండా... ఇక‌పై ప్ర‌తి విష‌యంలోనూ ఆ దేశంతో పోటీ ప‌డే స‌త్తా త‌న‌కుంద‌ని కూడా భార‌త్ ఎలుగెత్తి చాటిన‌ట్లైంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... సోష‌ల్ మీడియాలో భార‌త్ శ‌ర‌వేగంగా అభివృద్ధి సాధిస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. సాంకేతిక ప‌రంగా అమెరికా ఇత‌ర దేశాల కంటే ఎంతో అభివృద్ధి సాధించింద‌నే చెప్పాలి. ప్ర‌పంచంలోని సాఫ్ట్‌ వేర్ రంగ‌మే కాకుండా మిగిలిన రంగాల్లోనూ మేటి కంపెనీలుగా ఉన్న కంపెనీల‌న్నీ ఆ దేశానికి చెందిన‌వే ఉన్నాయి. అయితే ఆ కంపెనీల‌న్నీ త‌మ రెండో గ‌మ్య‌స్థానంగా భార‌త్‌ నే ఎంచుకుంటున్న వైనం ఇటీవ‌లి కాలంలో క్ర‌మంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ కు, ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది. మొత్తం 241 మిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లతో భారత్‌ ఈ స్థానాన్ని దక్కించుకుంది.

అమెరికాలో 240 మిలియన్‌ మందే యాక్టివ్‌ యూజర్లున్నారు. కంపెనీ ఇటీవలే 2 బిలియన్‌ యూజర్ల మార్కును చేరుకున్న‌ట్టు వెల్లడించింది. ఈ మార్కును చేధించిన కొన్ని రోజుల్లోనే టాప్‌ దేశాల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫేస్‌ బుక్‌ లో ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్‌ అధిగమించిందని నెక్ట్స్‌ వెబ్‌ వెల్లడించింది. అడ్వర్‌ టైజర్ల కోసం సోషల్‌ మీడియా దిగ్గజం గణాంకాలను ఈ పోర్టల్‌ విడుదల చేసింది. భారత్‌ లో ఫేస్‌ బుక్‌ యాక్టివ్‌ యూజర్లు రెండింతలు పైగా పెరుగుతున్నారని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
గత ఆరునెలల కాలంలోనే భారత్‌ లో యాక్టివ్‌ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. ఎక్కువమంది యాక్టివ్‌ యూజర్లున్నప్పటికీ, భారత్‌ లో ఫేస్‌ బుక్‌ వ్యాప్తి మాత్రం తక్కువగానే నమోదైంది. జూన్‌ నెలలో మొత్తం జనాభాలో కేవలం 19 శాతం మంది ప్రజలే ఫేస్‌ బుక్‌ ను వాడారు. ఫేస్‌ బుక్‌ వాడకంలోనూ లింగ అసమానత కనిపిస్తోంది. మూడు క్వార్టర్స్‌గానూ యాక్టివ్‌ ఫేస్‌ బుక్‌ ప్రొఫైల్స్‌లో పురుషులే ఆధిక్యంలో ఉన్నారు. దీనికి భిన్నంగా అమెరికాలో 54 శాతం మంది యాక్టివ్‌ యూజర్లు మహిళలే ఉన్నట్టు తెలిసింది. భారత్‌లో ఫేస్‌ బుక్‌ వాడుతున్న సగానికి పైగా యూజర్లు 25 ఏళ్ల లోపు వారేన‌ట‌.
Tags:    

Similar News