ప్ర‌పంచంలోని సగం సంప‌ద వారి వ‌ద్దే

Update: 2018-06-16 16:34 GMT
సంప‌ద అంతా ఓ వైపు పోగు అయిపోతోంద‌ని కొంద‌రు సామాజిక వేత్త‌లు ఆవేద‌న చెందుతున్న‌ప్ప‌టికీ...అదే ఒర‌వ‌డి కొన‌సాగుతోంది. పైగా, అది త‌న ప‌రిధిని మ‌రింత విస్త‌రించుకుంటూ అతికొద్దిమంది గుప్పిట్లోకి చేరుతోంది. ప్రపంచంలో వ్యక్తిగత సంపద భారీగా పెరిగిపోతున్నది. 2016తో పోలిస్తే గత ఏడాది వ్యక్తిగత సంపద 12 శాతం పెరిగి 201.9 ట్రిలియన్ డాలర్లుకు(రూ.13,781 లక్షల కోట్లు) వృద్ధి చెందినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.. నివేదిక వెల్లడించింది. ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదు కావడంతో పెట్టుబడిదారులకు భారీగా లాభాలు రావడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే వివిధ దేశాల కరెన్సీలు బలపడటంతో అమెరికాయేతర దేశాల పెట్టుబడిదారులకు మారకపు రేటు అదనంగా కలిసి వచ్చింది. దీంతో ప్రపంచంలో మిలియనీర్లు, బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ఇందులో అమెరికా కంటే చైనా ముందంజ‌లో ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత సంపదలో దాదాపు సగభాగం ఈ కొద్దిమంది బిలియ‌నీర్ల చేతుల్లోనే ఉండటం గమనార్హం. 2012లో దాదాపు 45 శాతం సంపద ఈ అపర కుబేరుల వద్దే ఉండగా ప్రస్తుతం అది మరింత పెరిగింది. మొత్తం వ్యక్తిగత సంపదలో 86.1 ట్రిలియన్ డాలర్ల (రూ.5,874 లక్షల కోట్లు)వ్యక్తిగత సంపద ఒక్క ఉత్తర అమెరికాలోనే ఉండటం విశేషం. మొత్తం వ్యక్తిగత సంపదలో మిలియనీర్లు, బిలియనీర్ల వద్ద ఉన్న సంపద శాతం పెరుగుతున్నదంటే పేదవారు ఇంకా పేదవారిగా మారిపోతున్నారని కాదని బోస్టన్ కన్సల్టింగ్ నివేదిక ప్రధాన రచయిత అన్నా జాక్రజ్వెస్కీ పేర్కొన్నారు. వ్యక్తిగత సంపద పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ ధనికులుగా మారిపోతున్నారని.. అయితే ధనికులు ఇంకా వేగంగా కోటీశ్వరులు అవుతున్నారని తెలిపారు.

2017లో బిలియనీర్ల సంఖ్య విషయంలో చైనా ప్రథమస్థానంలో నిలిచింది. బిలియనీర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానానికి ఆ దేశం ఎగబాకింది. వృద్ధి విషయంలో ఆసియా ఖండంలో చైనా దూసుకుపోతున్నది. ఆ దేశంలో 2.5 లక్షల డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ఆస్తులు కలిగిన వారు భారీగా పెరిగారు. ఇదేస్థాయిలో సంపద వృద్ధి కొనసాగితే రానున్న ఐదేండ్లలో అమెరికాలో కంటే చైనాలోనే ఎక్కువగా సంపద సృష్టించబడుతుందని అన్నా జాక్రజ్వెస్కీ తెలిపారు. అమెరికాతో పోలిస్తే చైనాలో నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో మిలియనీర్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

డాలర్ బలహీనపడిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే ప్రపంచ వ్యక్తిగత సంపదలో 7 శాతం పెరుగుదల చోటుచేసుకున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నగదు విలువ పెరుగడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందిన ప్రాంతం పశ్చిమ యూరప్. అమెరికా డాలర్ బలహీనపడటాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ 15 శాతం సంపద వృద్ధి నమోదు కాగా స్థానిక కరెన్సీలో 3 శాతం వృద్ధి నమోదైంది. తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు కూడా సంపద విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. పెట్టుబడిపెట్టే మొత్తం ఆస్తుల్లో దాదాపు పావు వంతును ఈ దేశాలకు చెందిన బిలియనీర్లు కలిగి ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచిలోని తూర్పు యూరప్‌కు చెందిన 28 మంది రూ.20.05 లక్షల కోట్ల సంపదను కలిగి ఉండటం విశేషం.
4

పెట్టుబడి నిధుల్లోని నగదు, ఆయా దేశాల్లోని ఈక్విటీ మార్కెట్లు పెద్దఎత్తున లాభాలను ఇవ్వడంతో పెట్టుబడిదారుల సంపద భారీగా పెరిగింది. అదేసమయంలో బాండ్లలో పెట్టుబడి పెట్టేవారికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. బాండ్లలో పెట్టుబడులు గత ఏడాది 7 శాతం క్షీణించాయి. కాగా మధ్య ప్రాచ్య దేశాల్లో మొత్తం సంపద రూ.259 లక్షల కోట్లు కాగా రూ.211 లక్షల కోట్ల సంపద పెట్టుబడి పెట్టే ఆస్తుల్లోనే ఉండటం విశేషం. పశ్చిమ యూరప్ మొత్తం వ్యక్తిగత సంపదలో 56 శాతం నగదు, డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. ఉత్తర అమెరికా విషయానికి వస్తే రూ.3,206 లక్షల కోట్ల (62 శాతం) వ్యక్తిగత సంపద పెట్టుబడి పెట్టే ఆస్తుల రూపంలో ఉంది.
Tags:    

Similar News