హైదరాబాద్‌ సదర్‌ ఉత్సవాలు.. రూ. 35 కోట్ల గరుడ దున్నపోతు ప్రత్యేకతలివే!

Update: 2022-10-24 15:13 GMT
హైదరాబాద్‌లో దీపావళి పండుగ తర్వాత రోజు జరిగే సదర్‌ ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా, అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వాహకులు ఏటా నిర్వహిస్తారు.

సదరు ఉత్సవాల విషయానికొస్తే.. మొదటిసారి 1946లో హైదరాబాద్‌లోని నారాయణగూడలో సదర్‌ ఉత్సవం ప్రారంభమైంది. 2009 నుంచి మరింత ఘనంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇక గతేడాది ఉత్సవాల్లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కింగ్‌ దున్నపోతు నిలిస్తే.. ఈసారి గరుడ, లవ్‌ రాణా, షేర్‌ ఖాన్, కట్టప్ప, షారుక్, సుల్తాన్‌ రాజు, శ్రీకృష్ణ  సందడి చేయనున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

కాగా సదర్‌ ఉత్సవాల్లో అతిపెద్ద ఆకర్షణ.. ఇందులో పాల్గొనే దున్నపోతులు. దేశంలో హరియాణా, పంజాబ్‌ల నుంచే కాకుండా ఆస్ట్రేలియా నుంచి ఈ సదర్‌ ఉత్సవాల్లో పాల్గొనడానికి దున్నపోతులు వచ్చేశాయి. ఇవి మామాలూ దున్నపోతులు కావు. ఈ ఏడాది సదర్‌ ఉత్సవాలకు కోసం ఇప్పటికే విచ్చేసిన గరుడ దున్నపోతు విలువ ఏకంగా రూ.35 కోట్లు కావడం గమనార్హం. అలాగే రూ.25 కోట్ల లవ్‌ రాణాతోపాటు మరో 8 రకాల మేలు జాతి దున్నపోతులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. దీంతో సదర్‌ ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఖైరతాబాద్‌కు చెందిన నిర్వాహకుడు పెద్ద గణేష్‌ విగ్రహం ముందు ఉన్న మున్సిపల్‌ మైదానంలో దున్నపోతుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మధు యాదవ్‌ 10 దున్నలను కొనుగోలు చేశారు.


డప్పు చప్పుళ్లు.. యువకుల డ్యాన్సులు, కేరింతల మధ్య అందంగా ముస్తాబు చేసిన దున్నరాజుల విన్యాసాలు సదర్‌ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎప్పటిలానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యాదవులు ఏర్పాట్లు చేస్తున్నారు.


కాగా ఈ ఏడాది జరిగే సదర్‌ ఉత్సవాల్లో హర్యానాకు చెందిన శ్రీకృష్ణ దున్నపోతు సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ నేపథ్యంలో హర్యానాతో పాటు పంజాబ్‌ నుంచి దున్నరాజులను నగరానికి తెప్పించారు. ఈసారి ఉత్సవాల్లో మొత్తం 8 దున్నరాజులు సందడి చేయన్నాయని చెబుతున్నారు.

కాగా హైదరాబాద్‌ నగరంలో ముషీరాబాద్‌కు చెందిన ఎడ్ల హరిబాబు యాదవ్, చప్పల్‌బజార్‌కు చెందిన లడ్డు యాదవ్, ఖైరతాబాద్‌కు చెందిన మధు యాదవ్‌తో పాటు మరికొందరు సదర్‌లో పోటీ పడేందుకు దున్నలను రెడీ చేస్తున్నారు.

ఎడ్ల హరిబాబు యాదవ్‌ ఇప్పటికే హర్యానాకు చెందిన దున్నరాజుతో పాటు శ్రీకృష్ణ వంటి దున్నలను తీసుకొచ్చారు. హర్యానాలో పలు చాంపియన్‌ షిప్‌లను గెలుచుకున్న దున్నను నగరానికి తరలించిన ఆయన దాన్ని అపురూపంగా బిడ్డను సాకినట్టు సాకుతున్నారు. ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయిస్తూ మంచి పోషకాహారం అందిస్తున్నారు.

హర్యానాకు చెందిన శ్రీకృష్ణ దున్న ఈసారి సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నదని చెబుతున్నారు. దీన్ని హర్యానాలోని ఇసాన్‌ జిల్లా జుగ్లాండ్‌ గ్రామం నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్‌ వాహనంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు తీసుకువచ్చారు. ఐదు ఏళ్ల వయస్సు, 1800 కిలోల బరువు, ఏడు అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు శ్రీకృష్ణ సొంతం.

శ్రీకృష్ణ దున్నకు ప్రతి రోజు రూ. 5 వేల విలువ చేసే ఆహారం పెడుతున్నారు. ఉదయం సాయంత్రం 10 లీటర్ల పాలు, డ్రైఫ్రూట్స్, ఖాజు, పిస్తా, ఆపిల్‌ పండ్లు, నెయ్యి, బెల్లం తదితర వాటిని ఆహారంగా అందిస్తున్నారు. ప్రతి రెండు లీటర్ల ఆవనూనెతో మసాజ్‌ చేయడంతో పాటు షాంపుతో స్నానం చేయిస్తున్నారు. దీని ఆలనా పాలన చూసేందుకు ప్రత్యేకంగా వ్యక్తులు ఉన్నారు. శ్రీకృష్ణ దున్న విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఫ్యాన్‌లు ఏర్పాటు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News