పురుగులతో భోజనం?.. వందే భారత్లో ప్రయాణికుడి ఫిర్యాదు వైరల్
ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యత మరోసారి వివాదానికి దారితీసింది.;
ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యత మరోసారి వివాదానికి దారితీసింది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే రైలులో ఒక ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ గట్టి చర్యలు తీసుకుంది. బాధ్యులైన ఐఆర్సీటీసీ మరియు సర్వీస్ ప్రొవైడర్పై భారీ జరిమానాలు విధించి, ఆహార భద్రత విషయంలో తమ కఠినత్వాన్ని చాటుకుంది. సామాన్యుడి పోరాటం రైల్వే వ్యవస్థలో కదలిక తెచ్చింది.
పెరుగు గిన్నెలో పురుగులు.. ప్రయాణికుడి షాక్:
మార్చి 15న రితేష్ కుమార్ సింగ్ అనే ప్రయాణికుడు వందే భారత్ రైలులో ప్రయాణిస్తుండగా ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆయనకు వడ్డించిన భోజనంలోని పెరుగు గిన్నెలో పురుగులు కదులుతుండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు. ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. ట్రైన్ మేనేజర్ను పిలిచి నిలదీయడమే కాకుండా, అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్నప్పుడు కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రైల్వే కేటరింగ్ తీరుపై మండిపడుతున్నారు.
రైల్వే శాఖ సీరియస్.. భారీ జరిమానాలు:
ఈ వీడియో ఇంటర్నెట్లో విపరీతమైన చర్చకు దారితీయడంతో రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించింది. ప్రయాణికుల ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఐఆర్సీటీసీ కి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, ఆహారాన్ని సరఫరా చేసిన సదరు సర్వీస్ ప్రొవైడర్కు రూ. 50 లక్షల భారీ పెనాల్టీ వేయడమే కాకుండా, వారి కాంట్రాక్ట్ను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా హెచ్చరికలు పంపింది.
అపరిచితుడు 'రామానుజం'లా మారిన రితేష్:
ఈ ఘటనలో రితేష్ కుమార్ సింగ్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. చాలామంది ప్రయాణికులు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు "మనకెందుకులే" అని వదిలేస్తుంటారు. కానీ రితేష్ మాత్రం ఎంతో పట్టుదలతో అధికారులను నిలదీసి, సమస్యను పైస్థాయి వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో నెటిజన్లు ఆయన్ను 'అపరిచితుడు' సినిమాలోని రామానుజం పాత్రతో పోలుస్తున్నారు. ఒక సామాన్య ప్రయాణికుడు తలుచుకుంటే వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారని అందరూ మెచ్చుకుంటున్నారు.