కాశ్మీర్ లో తీవ్ర ఉద్రికత్త ... 2 నెలలకి సరిపడా వంట గ్యాస్ నిల్వ ...

Update: 2020-06-29 10:10 GMT
సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో అటోఇటో తేల్చుకోవాలని ఇండియా భావిస్తోందా.. ఆ దిశగా అడుగులు వేస్తోందా అంటే .. తాజాగా జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ నిల్వలను సిద్ధం చేయండి.. తక్షణమే మా ఆదేశాలు పాటించండి’ అంటూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చమురు మార్కెంటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే , కాశ్మీర్ లోయలో తరచుగా కొండ చరియలు విరిగిపడుతుండటం వల్ల జాతీయ రహదారిని మూసేయాల్సి వస్తోంది. దీంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కాబట్టి తగినంతగా ఎల్పీజీని స్టాక్ ఉంచుకోవాలి అని జూన్ 27న పౌర సరఫరాల డైరెక్టర్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు జేసీ ముర్ము ఆదేశాలు జారీ చేశారు. వర్షా కాలంలో ఇలాంటి ఆదేశాలు సాధారణమేనని అంటున్నారు.

అలాగే , శీతాకాలంలో ఇలా ముందస్తు సన్నద్ధత సహజమే కానీ వేసవిలో ఇలా భారీ స్థాయిలో స్టాక్ ఉంచుకోవాలని సూచించడం మాత్రం సాధారణం కాదు. అంతే కాదు కేంద్ర పారామిలటరీ బలగాలు ఉండటానికి వీలుగా గండేర్‌ బల్ జిల్లాలో 16 విద్యా సంస్థల భవనాలను అందుబాటులో ఉంచాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు... జిల్లా యాంత్రాంగాన్ని అభ్యర్థించారు. అమర్‌నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకొని భద్రతా బలగాలకు వసతి కల్పించడం కోసం ఈ భవనాలను కేటాయించాలన్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్రకు జనం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాల్లేవు. ఈ స్థాయిలో భద్రతా బలగాలతో ప్రభుత్వం ఏం చేయనుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News