ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే ఉదయభాను పై 10 కేసుల ఎత్తివేత ?

Update: 2021-05-29 09:30 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భానుపై ప్రభుత్వం 10 క్రిమినల్ కేసులు ఎత్తివేసింది. రాష్ట్ర హోం శాఖ కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను నిందితుడిగా ఉన్న ప‌ది క్రిమినల్ కేసులని ఎత్తివేసింది. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు తెలంగాణలో పోలీసులపై 2019 జూలై లో దౌర్జన్యం చేసిన కేసు విచారణలో ఉంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటైన రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో ఈ పది కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి ఉపసంహరించుకుంటూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ ఏడాది మార్చి 23న డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. సీఎస్‌ పీఏ ఆర్గనైజేషన్‌ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని, వారిని అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌ లో, జగ్గయ్యపేట ఎన్టీఆర్‌ సర్కిల్‌ లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌ అండ్‌ బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించటం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులను ఎత్తివేశారు. వాటితోపాటు జగ్గయ్యపేట స్టేషన్‌ లోని మరికొన్ని కేసులు, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో నమోదైన కేసులను ఎత్తివేశారు.
Tags:    

Similar News