ప్రభుత్వ మెడికల్ షాపులు.. ప్రజలకు మరో వరం

Update: 2020-10-30 07:10 GMT
ప్రజారోగ్యం విషయంలో కేసీఆర్ సర్కార్ మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను నిర్వహించడంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచానికే తెలంగాణ మందులు అందిస్తోంది. దేశంలో ఫార్మా ఇండస్ట్రీకి తెలంగాణ కేంద్రంగా మారింది. తెలంగాణ నుంచే ప్రపంచంలోని దాదాపు 168 దేశాలకు మందులు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజల అవసరాలకు వాటి సేవలను వినియోగించుకోవాలన్నది ఆలోచనగా ఉంది. బ్రాండెడ్ జనరిక్ మందులు మాత్రమే అందుబాటులో ఉంచుతారని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపులను తొలగిస్తారు. ఆసుపత్రుల వద్దే కాకుండా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విరివిగా సర్కార్ మందుల దుకాణాలను నెలకొల్పుతారు.

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా సర్కార్ దవాఖానాలకు ఏటా సుమారు రూ. 300 కోట్ల విలువైన..సుమారు 600 రకాల వేర్వేరు మందులను కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 800కి పైగా ఫార్మా సంస్థలుండగా…ఇందులో అంతర్జాతీయ సంస్థలు అధికంగానే ఉన్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన లావాదేవీలు కొనసాగుతున్నట్లు అంచనా.

ఈ సంస్థల ప్రతినిధులతో నేరుగా ఆరోగ్య, పరిశ్రమ శాఖల ఉన్నతాధికారులు సమావేశమై ప్రత్యేకంగా బ్రాండెడ్ జనరిక్ ఔషధాలను ప్రభుత్వ ఔషధ దుకాణాల కోసం ఉత్పత్తి చేయాల్సిందిగా కోరాలని..ఈ మేరకు ఒప్పందం చేసుకోవాలని యోచిస్తున్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన.. చవకైన మందులను అందించాలని తెలంగాణ సర్కార్ ముందుకెళుతోంది.
Tags:    

Similar News