5సార్లు గెలిచి.. ఎమ్మెల్యే పదానికి నిలువెత్తు నిదర్శనం

Update: 2019-08-14 10:36 GMT
ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి.. నలగని ఖద్దరు చొక్కా, మిలమిలా మెరిసే బూట్లూ, కళ్లకు నల్లటి కళ్లజోడు, చేతికి బంగారు ఉంగరాలు, మెడలో చైను, ఖరీదైన వాచ్, సెల్ ఫోన్.. ఇలా అబ్బో ఆ రేంజే వేరు. జీవితంలో ఒక్కసారైన ఎమ్మెల్యే కావాలని కలలుకనే వారు ఎందరో ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆ ప్రజాప్రతినిధి రూపు రేఖలు సమూలంగా మారిపోతాయి. మొత్తం ఆస్తిపాస్తులు పెరిగిపోతాయి.. ఖరీదైన భోజనం, విందులు, వినోదాలు,విలాసాలు.. ఇలా ఉంటుంది ఎమ్మెల్యే జీవితం..

కానీ ఈయన వేరు.. ఎమ్మెల్యేలందరిలోకి పూర్తిగా డిఫెరెంట్. ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంత సింపుల్ గా ఉన్న వైనం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయక మానదు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్య తెల్లచొక్కా, కింద పంచెతో అచ్చం ఓ పేద రైతులా వచ్చి హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసిన రూ.5 భోజనాన్ని కొని తినడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గుమ్మడి నర్సయ్య.  ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983- 1985- 1989- 1999- 2004లో ఐదుసార్లు గెలిచి రికార్డ్ సృష్టించాడు. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా నీతిగా- నిజాయితీగా ప్రజా సేవ చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సైకిల్ పై గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవడం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.

ఎంతో నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన నర్సయ్య తాజాగా బాగ్ లింగం పల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద పేదల కోసం జీహెచ్ ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనాన్ని తినడం విశేషం. ఎంత ఎత్తుకు ఎదిగినా సాదాసీదా జీవితం గడుపుతున్న నర్సయ్య జీవనం నిజంగా నేటి ప్రజాప్రతినిధులకు నిజంగా  స్ఫూర్తిదాయకం.
Tags:    

Similar News