మాల్యా- మోడీ తాట తీసేందుకు ఈడీ కొత్త అస్త్రం

Update: 2018-04-25 06:23 GMT
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగవేసి లండన్‌ కు పారిపోయిన లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యాతోపాటు - పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) రూ.13,600 కోట్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన వ‌జ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ - అతని మేనమామ మెహుల్ చోక్సీలు - అలాగే రూ.7,000 కోట్లు మోసం చేసిన విన్సమ్ డైమండ్ సంస్థ అధినేత జతిన్ మెహతా వంటి ఎగ‌వేత‌దారుల‌కు చుక్క‌లు చూపించే అస్త్రం సిద్ధ‌మ‌వుతోంది. ఈడీ ఈ మేర‌కు రంగంలోకి దిగింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులకు సంబంధించి ఇటీవల తెచ్చిన ఆర్డినెన్సు కింద ఆస్తుల జప్తునకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధ‌మ‌వుతోంది. తొలి విడుతలో భాగంగా లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా - వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వంటి వారిపై చర్యలు తీసుకోనున్న ఈడీ.. రూ.15,000 కోట్లకుపైగా విలువైన ఆస్తులను ఈ ఆర్డినెన్సు పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

ఈ నూత‌న ఆర్డినెన్స్ ప్ర‌కారం బ్యాంకులకు పెద్ద ఎత్తున రుణాలను ఎగవేసినవారితోపాటు అధిక మొత్తంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినవారి కేసులన్నింటినీ అధికారులు ఏకం చేస్తున్నారు. వీరిపై కొత్త ఆర్డినెన్సు కింద చర్యలు చేపట్టడానికి అనుమతి కోరుతూ త్వరలో వివిధ ప్రత్యేక మనీ లాండరింగ్ వ్యతిరేక కోర్టులకూ వెళ్లనున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద మాల్యా కేసులో రూ.9,890 కోట్ల స్థిర  - చరాస్తులను జప్తు చేసిన ఈడీ.. పీఎన్‌ బీ స్కాం కేసులో రూ.7,664 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పీఎంఎల్ ఏ కింద కేవలం విచారణ ముగిసినప్పుడే ఆస్తులను జప్తు చేసుకోవచ్చు. కానీ కొత్త ఆర్డినెన్సులో తక్షణమే జప్తు చేసే వీలున్నది. దేశంలోగానీ - విదేశాల్లోగానీ తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాళ్లందరి ఆస్తులనూ స్వాధీనపర్చుకోవచ్చు. దీంతోనే తొలుత ప్రధాన కేసులన్నింటినీ ఈ ఆర్డినెన్సులోకి తేవాలని భావిస్తున్న ఈడీ.. ఆయా కేసుల్లో పీఎంఎల్ ఏ కింద జప్తు చేసిన, చేయాలనుకున్న ఆస్తులను ఆర్డినెన్సు కిందకు తీసుకురానున్నది. ఈ ఆర్డినెన్సుకు ఈడీనే అధికార సంస్థగా ఉండగా, దీంతో మరిన్ని ప్రత్యేక అధికారాలూ సొంతమయ్యాయి.


Tags:    

Similar News