కాంగ్రెస్ అంటే అభిమానమేనట, కానీ బీజేపీలోకే!

Update: 2019-07-19 01:30 GMT
తను భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నట్టుగా మరోసారి చెప్పుకున్నారు కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే  ఈ విషయాన్ని పలుసార్లు ఆయన చెప్పుకున్నారు. అయితే ఎంతకూ బీజేపీలోకి చేరడం లేదు. అయితే ఈ విషయాన్ని ఆయన మరోసారి ధ్రువీకరించారు. తను భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నట్టుగా ఆయన మరోసారి స్పష్టం చేశారు.

ఇదే సందర్భంలో తనకు కాంగ్రెస్ పార్టీ మీద చాలా అభిమానం ఉందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమే అని - అయితే తను మాత్రం కాంగ్రెస్ లో ఉండటం లేదని అన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ సర్కారును ప్రశ్నించే వాయిస్ అవసరం  అని - ఆ వాయిస్ కాంగ్రెస్ కు లేకుండా పోయిందని.. కేసీఆర్ ను ప్రశ్నించే వాయిస్ బీజేపీది మాత్రమే అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నాయకత్వ లోపం ఉందని - నాయకత్వం సరిగా లేకనే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా ఫిరాయించారని కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పీసీసీలో ఉన్న లోపాలను తను ప్రస్తావించినందుకే తనకు షోకాజ్ నోటీస్ జారీ చేశారన్నారు.

కాంగ్రెస్ అంటే తనకు గౌరవం ఉంది కాబట్టి..ఆ నోటీసులకు కూడా సమాధానం ఇస్తున్నట్టుగా.. త్వరలో తను  బీజేపీలోకి చేరడం మాత్రం ఖాయమని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు.  మోడీ పాలనను తను ప్రశంసించింది నిజమే  అని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News