స్పీకర్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసిన విపక్ష ఎమ్మెల్యే

Update: 2019-11-20 09:39 GMT
చట్టసభల్లో ఊహించని రీతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ మధ్యన పెరుగుతున్నాయి. ఆ మధ్యన లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీని.. నాటి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అనూహ్యంగా ఆయన వద్దకు వెళ్లి హగ్ చేసుకున్న వైనం సంచలనంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఆయన చర్యను పొగిడేస్తే.. మోడీతో సహా కొందరు మాత్రం ఎంతలా వ్యంగ్యంగా మార్చారో అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒడిశా అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సభా కార్యకలాపాలు సాగుతున్న వేళ.. తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన పనిని సభలో నవ్వులు పూయించింది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి స్పీకర్ పాత్రోకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే.. తాను చేసిన పనిలో స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చాలనో.. ఆయన్ను కించపర్చాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని.. తన నియోజకవర్గ సమస్యల్ని ఎంతో కాలం నుంచి సభలో ప్రస్తావించాలని అనుకున్నట్లు చెప్పారు. అలాంటి అవకాశం తనకీ రోజున రావటంతో కృతజ్ఙతతోనే ఇలా చేశానని వ్యాఖ్యానించారు.

ఒడిశా అసెంబ్లీలో 147 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. తనకే మొదట మాట్లాడే అవకాశం లభించటంతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫ్లాయింగ్ కిస్ ఇచ్చి కొత్త ట్రెండ్ కు తెర తీశారని చెప్పాలి. ఫ్లయింగ్ కిస్ ఇచ్చి.. అందుకు తగ్గట్లు తన వాదనను వినిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలతో సభ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.

తనకు మాట్లాడే అవకాశం దక్కలేదన్న విషయాన్ని గాంధీగిరితో భలేగా చెప్పాడుగా? అన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. తమకు మాట్లాడే అవకాశం దక్కని ఎమ్మెల్యేలు.. లోక్ సభలో ఎంపీలు ఇదే రీతిలో ప్లాయింగ్ కిస్సులు ఇస్తే.. స్పీకర్ స్థానంలో కూర్చున్న వారికి చిక్కులు తప్పవని చెప్పక తప్పదు.


Tags:    

Similar News