పెళ్లి ఇష్టం లేదని చెప్పిన వరుడు .. అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య !

Update: 2021-03-05 05:32 GMT
చిత్తూరు జిల్లాకు చెందిన  సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలోని డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సుష్మాకు చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ అనే యువకుడితో జరగాల్సిన పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది.  పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. చిత్తూరు పోలీసు కాలనీకి చెందిన సుష్మ  అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది. జిల్లాలోని పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన భరత్ టెక్సాస్‌ లో సాఫ్ట్ ‌వేర్ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చియించిన పెద్దలు లగ్న పత్రికలు కూడా రాయించారు.

ఈ నెల 3న వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసి ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని వరుడు షాక్ ఇచ్చాడు. ఈ విషయమై ఇరుకుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది.  కొన్ని రోజులు ఆగితే అన్నీ సర్దుకుంటాయని ఇరు కుటుంబాల వారు ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినా భరత్‌ పెళ్లికి నిరాకరించాడు. దీనితో  తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం అమెరికాలో తాను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణమైన భరత్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుష్మ కుటుంబ సభ్యులు చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News