డిప్యూటీ గారూ..సీఎం మాటలు నమ్ముతున్నారా

Update: 2016-10-23 10:16 GMT
ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ముందూవెనుకా చూసుకోకుండా విపక్ష నేత జగన్ పై చేసిన విమర్శలు ఇప్పుడు చంద్రబాబుకు చుట్టుకునేలా ఉన్నాయి. విపక్ష వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ - అంబటి రాంబాబు వంటి నేతలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ విమర్శలు చేస్తుండడంతో చినరాజప్ప తాజాగా వారిపై మాటల దాడి చేశారు. మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నించారు. అయితే... అది చివరకు టీడీపీకే బూమరాంగ్ లా తగిలిందంటున్నారు విమర్శకులు.

ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడడంతగ్గించేశారని.. తాను విమర్శిస్తే - ప్రజలు నమ్మడం లేదన్న నిజం తెలుసుకున్నందుకే ఆయన తాను చేయాలనుకుంటున్న విమర్శలను బొత్స సత్యనారాయణ - అంబటి రాంబాబులతో చేయిస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు. జగన్ కుహనా రాజకీయాలు నడుపుతున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నిప్పులు చెరిగారు. లోకేష్ - తానూ మాట్లాడిన మాటల వీడియోను బయట పెట్టినప్పటికీ, వారి అసత్య ప్రచారం నిలవలేకపోయిందని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఓ కుటుంబ సభ్యుడినని - చంద్రబాబు తనను సొంత సోదరుడిలా చూసుకుంటారని వ్యాఖ్యానించిన చినరాజప్ప  పత్రికలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు వార్తలేనని అన్నారు. బొత్స - అంబటి చేస్తున్న విమర్శలను సైతం ప్రజలు నమ్మని రోజులు వచ్చేశాయని అన్నారు.

అయితే.. టీడీపీలో కూడా పొద్దున లేస్తే మంత్రులు, కొందరు నోరున్న ఇతర నేతలు నిత్యం వైసీపీపై విరుచుకుపడుతూనే ఉంటారు. చంద్రబాబు మాటలు కూడా జనం నమ్మకపోవడం వల్లే వారంతా మాట్లాడుతున్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మాటలు జనం నమ్ముతున్నారో లేదో చినరాజప్పే చెప్పాలి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News