కేఈ, శిద్ధా, సునీత‌... వీళ్ల‌ను బాబు వ‌దిలేశారు

Update: 2017-05-19 06:28 GMT
ఏపీలోని ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు ఆడుకుంటున్నారని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన్ను చంద్రబాబు ఏదో రకంగా అవమానిస్తున్నారని కేఈ వర్గీయులు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన రెవెన్యూ మంత్రి పదవి ఇచ్చినా కూడా నిత్యం అవమానాలతో వేధిస్తున్నారని అంటున్నారు.  అమరావతి నిర్మాణం... రెవన్యూ శాఖలో బదిలీల సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు.
    
తాజాగా జిల్లాల ఇన్‌ చార్జి మంత్రుల నియామకంలోనూ కేఈని పక్కనపెట్టారు.  ఏ జిల్లాకూ ఇన్‌ చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్‌ లో అందరికంటే సీనియర్‌ అయినా ఆయనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టడంపై అంతా ఆశ్చర్యపోయారు. పోనీ డిప్యూటీ సీఎం అని ప‌క్క‌న పెట్టార‌నుకుందాం అంటే... మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించగా కేఈకి మాత్రం ఏ పనీ చెప్పలేదు.
    
ఇటీవల జరిగిన కేబినెట్‌ పునర్వ్యస్థీకరణలో శాఖలు మారిన మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీతలకూ జిల్లాల బాధ్యతలు అప్పగించలేదు.  బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావునూ చంద్రబాబు ఎందుకో వదిలేశారు.  టీడీపీ-బీజేపీ విభేధాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులను పక్కనపెట్టారన్న వాదనలు విన్పిస్తున్నాయి. మ‌రి కేఈ, శిద్దా, ప‌రిటాలను ఎందుకు ప‌క్క‌న పెట్టిన‌ట్టు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News