జ‌గ‌న్‌ ను తిడితే ప‌ద‌వి గ్యారంటీ!

Update: 2016-10-01 07:56 GMT
డొక్కా మాణిక్య వరప్రసాద్‌... ప్ర‌స్తుతం టీడీపీ నేత. కొద్దికాలం క్రితం వ‌ర‌కు కాంగ్రెస్ వాది అయిన సీనియ‌ర్ నాయ‌కుడు. పార్టీ మారిన త‌ర్వాత టీడీపీ నాయ‌కుడి హోదాలో మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డ్డారు. మిగతా నాయ‌కులు - మంత్రుల‌కంటే ఎక్కువ‌గా దుమ్మెత్తిపోశారు. ఇదిలాఉండ‌గా తాజాగా ఆయ‌న్ను రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌ గా నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప‌రిణామాన్ని ప‌లువురు రాజ‌కీయాల కోణంలో చూస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలోని పలు నామినేటెడ్‌ పోస్టుల భ‌ర్తీ కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆయా పోస్టుల‌ను - వాటి అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి కొన్ని నామ‌మాత్ర‌పు పోస్టులను - రాష్ట్ర కనీస వేతన సలహా మండలిని భ‌ర్తీ చేశారు. ఛైర్మన్‌గా డొక్కాను మరో పందొమ్మిది మందిని సభ్యులుగా నియమించారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం ప‌నిచేసిన అనేక నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ డొక్కా మాణిక్య‌కు పద‌వి క‌ట్ట‌బెట్ట‌డం వెనుక ప్ర‌తిప‌క్ష నేతపై దూకుడుగా వెళ్ల‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఇటీవ‌లి కాలంలో వివిధ అంశాల‌పై జ‌గ‌న్‌ పై డొక్కా పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు చేశారు. మిగ‌తా నాయ‌కుల కంటే ఘాటుగా స్పందించ‌డం, ఆయా విష‌యాల్లో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిస్తున్న నేప‌థ్యంలో  ఈ ప‌ద‌వికి ద‌క్కిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఈ నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని చెప్తున్నారు.

ఇదిలాఉండ‌గా...విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఛైర్మన్‌ గా యలమంచిలి గౌరంగ బాబు నియమితులయ్యారు. ఏపీ పర్యాటకాభివృద్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా జయరామిరెడ్డి - హస్తకళల డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కు పాలి ప్రసాద్‌ నియమితులు అయ్యారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి బోర్టు ఏర్పాటైంది. రాష్ట్ర అల్ప సంఖ్యాకవర్గ ఫైనాన్స్‌ కార్పొ రేషన్‌ కు ఛైర్మన్‌ గా మహమద్‌ హిదాయత్‌ - వైస్‌ ఛైర్మన్‌ గా పర్వీన్‌ తాజ్‌ నియమితులయ్యారు. మేదర సహకార సంఘం ఫెడరేషన్‌ కు ఎం సుందరయ్య - కృష్ణ బలిజ - పూసల కోఆపరేటివ్‌ సొసైటీల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ గా కావేటి సామ్రాజ్యం - ఏపీ గీత కార్మికుల కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ గా తోట జయప్రకాష్‌ నారాయణ నియమితులయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News