18 మంది ఉగ్ర‌వాదుల పేర్లు ప్ర‌క‌టించిన కేంద్రం.. జాబితాలో హైదరాబాద్ వాసి !

Update: 2020-10-28 13:10 GMT
ఉగ్ర‌వాదంపై కేంద్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉంది.   చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల ర‌క్ష‌ణ చ‌ట్టం(యూఏపీఏ) 1967 కింద కొత్త‌గా 18 మందిని ఉగ్ర‌వాదులుగా ప్ర‌క‌టించారు. జాతీయ భ‌ద్ర‌త‌ను బ‌లోపేతం చేయ‌డంలో,  జీరో టాల‌రెన్స్ విధానంలో భాగంగా మోదీ స‌ర్కార్ 18 మంది వ్య‌క్తుల‌ను ఉగ్ర‌వాదులుగా గుర్తించిన‌ట్లు‌ కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది.  యూఏపీఏ చ‌ట్టంలోని నాలుగ‌వ షెడ్యూల్‌ లో ఉగ్ర‌వాదుల‌ పేర్ల‌ను చేర్చింది.

జాబితాలో ఉన్న వారి పేర్లు ... సాజిద్ మీర్‌, యూసుఫ్ ముజ‌మ్మిల్‌, అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కి, షాహిద్ మెహ‌మూద్‌, ఫ‌ర్హ‌తుల్లా ఘోరీ, అబ్దుల్ రౌఫ్ అస్గ‌ర్‌, ఇబ్ర‌హీం అత్త‌ర్‌, యూసుఫ్ అజ‌హ‌ర్‌,  షాహిద్ ల‌తిప్‌, స‌య్యిద్ మొహ‌మ్మ‌ద్ యూసుఫ్ షా, గులామ్ న‌బీ ఖాన్‌, జాఫ‌ర్ హుస్సేన్ భ‌ట్‌,  రియాజ్ ఇస్మాయిల్ షాబాద్రి, మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, షేక్ ష‌కీల్‌, మ‌హ్మ‌ద్ అనిస్ షేక్‌, ఇబ్ర‌హీమ్ మీన‌న్‌, జావెద్ చిక్నాలు ఆ లిస్టులో ఉన్నారు. దేశ స‌రిహ‌ద్దుల్లో వీరంతా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  

ఈ 18 మంది ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాద్‌, మాదన్నపేట సమీపంలోని కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ పేరును కూడా చేర్చింది.  పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్  సానుభూతి పరుడైన ఫర్హతుల్లా 1998లోనే ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టు పోలీసులు తెలిపారు. తొలుత దుబాయ్ పారిపోయి అక్కడి నుంచి ఉగ్రకార్యకలాపాలు ప్రారంభించిన ఫర్హతుల్లా ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్నాడు.
Tags:    

Similar News