కన్నాకు ఎసరే.. కొత్త బీజేపీ చీఫ్ ఎవరు?

Update: 2020-03-17 14:30 GMT
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేశారు. బడుగు బలహీన బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ని అనూహ్యంగా తెలంగాణ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దూకుడుకు మారుపేరైనా బండికి ఈ పదవి రావడం ఏపీ పాలిటిక్స్ లోనూ చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ఏపీలోనూ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరనే చర్చ మొదలైంది. ఏపీలో రెండు బలమైన సామాజికవర్గాల చేతుల్లోనే అధికారం ఉంది. రెడ్డి నేతలు అధికారంలో ఉండగా.. కమ్మ నేతలు ప్రతిపక్షం లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరి తర్వాత బలమైన కాపులకు మరోసారి బీజేపీ పీఠం దక్కబోతోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈసారి బీజేపీ ఏపీ అధ్యక్ష రేసులో తెలంగాణలో వలే కొత్త ముఖమే కనిపించనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బలం లేని బీజేపీ దీనిపై ఆశలు పెంచుకోలేదు. బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిశాక బీజేపీ కొత్త చీఫ్ రావచ్చని అంటున్నారు.

బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్నాయి. కాపు అయిన పవన్, మరో కాపు నేత కన్నా కలిసిపోయి పోరాడుతున్నారు. కాపు ఓటు బ్యాంకు తమవైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ బీజేపీకి అస్త్రంగా ఉన్నారు. ఇక వారికి కాపు అయిన కన్నా లక్ష్మీనారాయణ అక్కర్లేదు. అందుకే కొత్త సామాజికవర్గాలకు ఆ పీఠం ఇవ్వాలని బీజేపీ యోచిస్తోందట..

ప్రస్తుతం ఏపీ అధ్యక్ష రేసులో ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు, మాణిక్యాల రావు వంటి వారు ఉన్నారని సమాచారం. పురంధేశ్వరి, జీవీఎల్, సుజనా, సీఎం రమేశ్ వంటి వారి మద్దతు ఇక్కడ కీలకం కానుందట.. ఎన్నికల తర్వాత వీరిలో ఒకరు బీజేపీ అధ్యక్షుడు కావడం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News