ఒకే పార్టీ.. ఒకరే పీఎం, బీజేపీ నినాదం!

Update: 2019-08-06 07:27 GMT
దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలనే  దిశగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ - దేశంలో ఒకే పార్టీ మిగలాలి  అనే నినాదాన్ని కూడా బయటకు చెప్పకుండానే అమలు  చేసేలా ఉంది. మొన్నటి వరకూ కొన్ని పార్టీల వాళ్లు ఈవీఎంలతో మోసం జరుగుతూ ఉందని - ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పడుతోందని వాపోయారు. వారి ఆవేదనలో నిజం ఎంతో కానీ.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, వివిధ రాష్ట్రాల్లోని పరిణామాలను గమనించాకా మాత్రం - ఏ పార్టీ తరఫున నెగ్గినా ఎమ్మెల్యేలు భారతీయ జనతాపార్టీలోకి చేరిపోతున్న వైనం స్పష్టం అవుతూ ఉంది.

తమకు మెజారిటీ వచ్చినా - రాకున్నా భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారాలను సొంతం చేసుకునే దిశగాసాగుతూ ఉంది. ఇందు కోసం బీజేపీ సామదానబేదదండోపాయాలన్నింటినీ ఉపయోగించుకుంటూ ఉంది. ఆ వైనాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.

ఇక కశ్మీర్ వ్యవహారంలో కూడా బీజేపీ దూకుడును అంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పలు నిర్ణయాలకు - అభిప్రాయాలకు అవకాశం ఉంటుంది.అయితే  బీజేపీ మాత్రం ఏ విషయంలోనూ ఎవరి నిర్ణయాన్నీ తీసుకునేలా లేదు. తమకు తోచిందే చేస్తూ ఉన్నారు.

ఇది నిరాకుశమైన తీరు  అనే విమర్శ వస్తోంది. అయితే ఆ విమర్శలను మోడీ - అమిత్ షాలు పట్టించుకునేలా లేరు. మరోవైపు మోడీకి వయసు నిబంధనను కూడా తప్పించేలా ఉన్నారు. డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన వారు కీలక పదవులను అధిష్టించకూడదని మొన్నటి వరకూ ఒక నియమాన్ని అమలు చేశారు. ఆ నియమం పేరుతో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు అవకాశాన్ని చూసుకుని ఆ నియమాన్నీ పక్కన పెడుతూ ఉన్నారు.

రానున్న రోజుల్లో ఒక దేశం ఒకే ఎన్నిక అంటూ బీజేపీ మరో రాజకీయ ఎత్తుగడను అమలు పెట్టడం ఖాయమైందనే అనుకోవాలి.  ఇలాంటి నేపథ్యంలో ఆ నినాదానికి అనుగుణంగా ఒక దేశం - ఒకే పార్టీ - ఒకరే పీఎం అనే నినాదాన్ని కూడా బీజేపీ అమలు చేసేలా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!
Tags:    

Similar News