త‌మిళ‌నాడు పై బీజేపీ ముద్ర‌.. వ్యూహం అంటే మోడీదే.. !!

Update: 2021-02-14 08:30 GMT
రాజ‌కీయాలు అంద‌రూ చేస్తారు. కానీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసే రాజ‌కీయాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఆయ‌న ఎప్పుడు ఏం చేసినా.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేకుండా అడుగులు వేయ‌ర‌నిబీజేపీ సీనియ‌ర్లే చెవులు కొరుక్కుంటుంటారు. పైగా ద‌క్షిణాదిన పాగా వేయాల‌ని మోడీ.. అమిత్ షాల ద్వ‌యం.. ఎప్ప‌టి నుంచో స్కెచ్ వేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఎప్పుడు ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా.. వ‌ద‌ల కుండా ముందుకు సాగుతున్నారు. తాజాగా.. త‌మిళ‌నాడులో పాగా వేయాల‌ని లేదా.. పుంజుకోవాల‌ని.. నిర్ణ‌యించుకున్న మోడీ..  ఆదిశ‌గా రాజ‌కీయాల‌ను తీవ్రం చేశారు.

ఖ‌చ్చితంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ రాష్ట్రంలో ప‌నులు పూర్త‌య్యేలా కేంద్ర ప్రాజెక్టుల‌కు ప్లాన్ చేసుకుని.. తాజాగా వాటిని ప్రారంభిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త‌మిళ‌నాడులో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించ‌నున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రానున్న నేప‌థ్యంలో మోడీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది. ఇక‌, ప్ర‌ధాన మంత్రి చెన్నై మెట్రో రైల్ ఒక‌టో ద‌శ విస్త‌ర‌ణ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌ను న్నారు. ఈ ప‌థ‌కం 3770 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో పూర్తి అయింది. అలాగే, ప్ర‌ధాన మంత్రి వాష‌ర్ మ‌న్ పేట్ నుంచి విమ్‌కో న‌గ‌ర్‌కు ప్ర‌యాణికుల సేవ‌ల‌ను ప్రారంభిస్తారు.

9.05 కి.మీ పొడ‌వైన ఈ విస్త‌ర‌ణ మార్గం ఉత్త‌ర చెన్నై ని విమానాశ్ర‌యం తోను, సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్ తోను క‌లుపుతుంది. అదేవిధంగా ప్ర‌ధాన మంత్రి మోడీ చెన్నై బీచ్ కు, అత్తిప‌ట్టు కు మ‌ధ్య నాలుగో రైలు మార్గాన్ని ప్రారంభించ‌నున్నారు. 22.1 కి.మీ నిడివి ఉన్న ఈ సెక్ష‌న్ ను 293.40 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు తో నిర్మించారు. ఇది చెన్నై నుంచి తిరువ‌ళ్ళూర్ జిల్లా ల‌లో సాగుతూ చెన్నై పోర్ట్ నుంచి ట్రాఫిక్ స‌జావుగా సాగేట‌ట్లు దోహ‌దం చేస్తుంది. ఈ సెక్ష‌న్ చెన్నై పోర్టును, ఎణ్ణూరు పోర్టును క‌లుపుతుంది. ఇది మార్గ‌మ‌ధ్యం లో ప్ర‌ధాన‌మైన యార్డుల గుండా వెళ్తూ, రైళ్ళ రాక‌పోక‌ల సౌల‌భ్యాన్ని ప్ర‌సాదిస్తుంది.

ప్ర‌ధాన మంత్రి విల్లుపురం-క‌డ‌లూరు-మైలాదుతురై-తంజావూరు లతో పాటు, మైలాదుతురై-తిరువారూర్ లో సింగిల్ లైన్ సెక్ష‌న్ తాలూకు రైల్వే విద్యుదీక‌ర‌ణ ను ప్రారంభిస్తారు. 423 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో పూర్తి చేసిన ఈ విద్యుదీక‌ర‌ణయుత మార్గం 228 కి.మీ మేర సాగుతూ చెన్నై, ఎగ్మూరు, క‌న్యాకుమారి మ‌ధ్య రాక‌పోక‌ల‌కు మార్గం మార‌వ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా సాఫీగా ట్రాఫిక్ సాగిపోయేందుకు వీలును క‌ల్పిస్తుంది. అయితే.. ఇవ‌న్నీ.. కూడా ఖ‌చ్చితంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు కొన్ని వారాల ముందు ప్రారంభిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టే.. మోడీ టైమింగంటే.. టైమింగ‌ని.. పాలిటిక్స్ అంటే ఇలానే ఉంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News