చంద్రబాబుపై కర్ణాటకలో సెటైర్లు!

Update: 2019-06-23 06:06 GMT
కర్ణాటకలోని బీజేపీ నేతలు, కర్ణాటకకు ఏదైనా పార్టీ కార్యక్రమానికి వెళ్లే బీజేపీ నేతలు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సెటైర్లు ఆపడం లేదు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ ఎదుర్కొన్న ఓటమి మీద, ప్రస్తుతం తెలుగుదేశంపార్టీలోని పరిణామాల మీద వారు సెటైరిక్ గా మాట్లాడుతూ ఉన్నారు.

దానికి ప్రత్యేక కారణం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కర్ణాటకకు ప్రచారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ - జేడీఎస్ లకు అనుకూలంగా ప్రచారం చేశారు. కర్ణాటకలో ఆ పార్టీల కూటమి ఎంతగా చిత్తు అయ్యిందో తెలిసిన సంగతే.

ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో చంద్రబాబు నాయుడి ప్రస్తావన వస్తూ ఉంది. తాజాగా బీజేపీ నేత - ఎమ్మెల్సీ మాధవ్ కర్ణాటక వెళ్లి చంద్రబాబు నాయుడుకు హెచ్చరిక చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి కనుమరుగు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

మోడీని వ్యతిరేకించడానికి అంటూ చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగారు అని, చివరకు ఆయన పార్టీ వాళ్లే ఓడిపోయారని.. ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి చూస్తూ ఉన్నారని, తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగుదేశం పూర్తిగా ఖాళీ అవుతుందని ఆయన అన్నారు.
Tags:    

Similar News