టీడీపీకి అశోక్ గజపతి షాక్ ఇవ్వబోతున్నారా?

Update: 2019-02-16 08:23 GMT
కేంద్రమాజీ మంత్రి - టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ కు గైర్హాజరవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలకు కలత చెంది ఆయన టీడీపీకి దూరంగా జరగడం పార్టీలో దుమారం రేపుతోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..  టీడీపీలో సీనియర్ అయిన తనను అధినేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని పొలిట్ బ్యూరో మీటింగ్ కు అశోక్  గజపతిరాజు డుమ్మా కొట్టినట్టు వార్తలొస్తున్నాయి. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట.. ఇటీవల తన ఏరియా అయిన ఉత్తరాంధ్రలో నిర్వహించిన భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన సభకు కూడా ఈ కారణంతోనే అశోక్ గజపతి గైర్హాజరయ్యారు.   ఇప్పుడు పొలిట్ బ్యూరోకు కూడా రాకపోవడంతో అశోక్ గజపతి రాజు టీడీపీని వీడనున్నారా అన్న చర్చ జరుగుతోంది.

అరకు మాజీ ఎంపీ  - కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కిషోర్ చంద్రదేవ్ ను టీడీపీ అధినేత పార్టీలో చేర్చుకోవాలనుకోవడం.. తనకు పడని పోటీ వ్యక్తిని తీసుకున్నప్పుడు కనీసం మాట మాత్రమైనా తనకు చంద్రబాబు చెప్పకపోవడంపై అశోక్ గజపతి అలకబూనినట్టు సమాచారం. కనీసం తన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కిషోర్ చంద్రదేవ్ ను ఆహ్వానించడంపై అశోక్ గజపతి చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు.

అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్ నేత ఇలా భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు, పొలిట్ బ్యూరో మీటింగ్ కు హాజరుకాకపోవడం చిన్న విషయమేమీ కాదు.. ఆయన టీడీపీ అధినేత వైఖరి నచ్చక ఇదంతా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి టీడీపీని వీడే జాబితాలో అశోక్ గజపతి చేరుతారా.? టీడీపీకి పెద్ద షాకిస్తారా అన్నవి వేచి చూడాల్సిందే.. అయితే ఈ వార్తలపై మాత్రం అశోక్ గజపతి అధికారికంగా స్పందించకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.



Tags:    

Similar News