మంత్రి ర‌జ‌నీ గారికో విన్న‌పం ? మా ఊరి క‌థ వినండి !

Update: 2022-04-22 23:30 GMT
తెలంగాణ‌లో మూడు మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల నిర్మాణానికి అక్క‌డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తొమ్మిది వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో ఎల్బీ న‌గ‌ర్ లో, 882 కోట్ల రూపాయ‌ల‌తో స‌న‌త్ న‌గ‌ర్ లో, అల్వాల్ లో 897 కోట్ల రూపాయల‌తో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (క్లుప్తంగా టిమ్స్‌) కు అంగీకారం తెలిపింది. పాల‌న సంబంధ అనుమ‌తులు కూడా ఇచ్చేసింది.

ఇదంతా అక్క‌డి రాజ‌ధాని హైద్రాబాద్ లో ఏర్పాటు  కానున్న వివ‌రం. ఇదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా వివిధ ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ మ‌రియు ఆధునికీక‌ర‌ణ‌కు అక్క‌డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంచి నిర్ణ‌యాలే తీసుకుంటున్నారు. అయితే తెలంగాణ‌కు కూడా అప్పులున్నాయి. తెలంగాణ‌లో కూడా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ఉంది.

తెలంగాణ‌కు కూడా కేంద్ర స‌హ‌కారం పెద్ద‌గా లేని దాఖలాలు కొన్ని ఉన్నాయి. అయినా కూడా కొన్ని విష‌యాల్లో త‌ప్పిదాలు ఉన్నా కూడా ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం  వైద్యారోగ్య శాఖ‌పై  
మంచి దృష్టినే సారిస్తోంది. మంత్రి హ‌రీశ్ రావు కూడా పూర్తిగా వైద్య రంగం ప్ర‌క్షాళ‌న‌కు త‌న వంతు కృషి చేస్తున్నారు. ఏదో సోష‌ల్ మీడియా పోస్టుల కోసం ఆస్ప‌త్రుల త‌నిఖీలు అయితే చేప‌ట్ట‌డం లేదు.  ఆ విధంగా ఆయ‌న ఎటువంటి ప్ర‌చారం కూడా కోరుకోవ‌డం లేదు.

ఇదే స‌మ‌యంలో మ‌న ఏపీలో కొత్త‌గా వైద్యారోగ్య శాఖ  బాధ్య‌త‌లు అందుకున్న విడ‌ద‌ల ర‌జ‌నీ గ‌తం క‌న్నా మెరుగ్గా సంబంధిత వ‌ర్గాలు ప‌నిచేసేందుకు కృషి చేయాల్సి ఉంది. కొత్త ఆస్ప‌త్రుల ఏర్పాటుకు గ్రామీణ స్థాయిలో వైద్యం అందేందుకు మ‌రింత మెరుగ్గా
సేవ‌లు అందేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి.

అంతేకానీ దేశంలోనే విశిష్ట రీతిలో ఏపీలో వైద్య సేవలు అందుతున్నాయి పేద‌ల‌కు మ‌రియు ఇతర వ‌ర్గాల‌కు అని చెప్ప‌డంతో  ప‌ని అయిపోదు. గుంటూరు ఆస్ప‌త్రికి మొన్న‌నే వెళ్లి వ‌చ్చారు క‌దా  !  త‌రువాత కూడా ఆమె వెళ్తే త‌రుచూ త‌నిఖీలు  చేస్తే (ఆక‌స్మిక త‌నిఖీలు) మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. అంతేకానీ కేవ‌లం ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల‌కే  ప‌రిమితం కావ‌డం వ‌ల్ల ఆమెకు స‌మ‌ర్థురాలు అన్న పేరు అయితే రాదు అని విప‌క్షం హిత‌వు చెబుతోంది.

ముఖ్యంగా ఏపీలో ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌కు నిధుల మంజూరు అన్న‌ది స‌రిగా ఉండ‌డం లేదు అన్న‌ది ఓ విమ‌ర్శ లేదా అభియోగం. ఆర్థిక లోటు కార‌ణంగానే ఈ స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని గ‌తంలో కొన్ని క‌థ‌నాలు వెలుగు చూశాయి. పోనీ మీడియా అబ‌ద్దాలు చెప్పిందే అనుకున్నా, క్షేత్ర స్థాయిలో నిజాలు దాగ‌వు క‌నుక ఆళ్ల నాని నేతృత్వంలో ఏమ‌యినా త‌ప్పులు జ‌రిగి ఉంటే వాటిని కూడా స‌రిదిద్దే బాధ్య‌త కొత్త‌గా ప‌గ్గాలు అందుకున్న మంత్రివ‌ర్యుల‌దే ! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వాస్త‌వ విరుద్ధం అయిన ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వ‌ల్ల ఆమెకే న‌ష్టం. శ్రీ‌కాకుళం లాంటి మారుమూల ప్రాంతాల‌కు, పాడేరు, సీతంపేట లాంటి గిరిజ‌న ప్రాంతాల‌కు ఆమె వ‌చ్చి వెళ్తే గ్రౌండ్ లెవ‌ల్ రియాల్టీ ఏంట‌న్న‌ది తెలిసి వ‌స్తుంది. లేదంటే కేవ‌లం  రంగుల్లో ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే మిగులుతాయి.
Tags:    

Similar News