మహిళలపై అద్దేపల్లి శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు...అనిత ఫైర్

Update: 2020-10-10 17:33 GMT
ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. డిక్లరేషన్ వ్యవహారంలో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కోర్టుల వ్యవహారంలో స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలను కోర్టు కూడా తప్పుబట్టింది. అమరావతి రైతులను అవమానించారంటూ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజుపై డీఎస్పీకి దళిత మహిళలు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వైసీపీ నేత మహిళలపై నోరు పారేసుకున్న ఘటన సంచలనం రేపింది. అమరావతి రైతుల ఉద్యమంపై చర్చ సందర్భంగా లైవ్ లో మాట్లాడుతున్న వైసీపీ నేత అద్దేపల్లి శ్రీధర్....కాంగ్రెస్ కు చెందిన మహిళా నేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడితే విజయవాడ వచ్చి తంతా నిన్ను..’’ అంటూ కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీపై అద్దేపల్లి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.

ఈ నేపథ్యంలో అద్దేపల్లి శ్రీధర్ వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు.
శ్రీధర్ వ్యాఖ్యలపై వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళలపై వైసీపీ నేతల తీరు తీవ్ర ఆక్షేఫణీయమని అనిత ట్వీట్ చేశారు. ‘‘బెజవాడ వచ్చి తంతావా? సరే రా,నీ తల్లి,నీ భార్యబిడ్డలు,నీ సోదరి చెయ్యలేని పనిని బెజవాడ మహిళలు చేస్తారు. బజారు వాడిలా మాట్లాడిన నీకు సంస్కారం, పద్ధతి నేర్పి పంపుతారు. ఆడవారి మీదా నీ ప్రతాపం .....మీ నేత జైల్లో ఉన్నప్పుడు ఇంట్లోని ఆడవాళ్ళు కాపాడారు పార్టీని. గుర్తు పెట్టుకో.’’ అంటూ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలపై అనిత నిప్పులు చెరిగారు. వీళ్లా దిశ చట్టం తెచ్చి మహిళలకు న్యాయం చేసేది అంటూ  అనిత వైసీపీ నేతలను కడిగిపారేశారు.
Tags:    

Similar News