పులివెందులలో వాళ్లపై పోలీస్ మార్క్.. అదరగొట్టేశారు
నాలుగు రోజు లక్రితం మద్యం మత్తులో వీరంగం వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..;
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేసే వారికి వినూత్న రీతిలో ట్రీట్ మెంట్ ఇవ్వా్లసిన అవసరం ఉంది. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పోలీసులు ఇదే తీరును ప్రదర్శించారు. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. అల్లర్లకు పాల్పడిన ఎనిమిది మందికి పగలే చుక్కలు కనిపించేలా.. పోలీసులు వారికి తమదైన ట్రీట్ మెంట్ ను ఇచ్చారు. నడి వీధిలె నడిపించుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్లారు.
నాలుగు రోజు లక్రితం మద్యం మత్తులో వీరంగం వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే ప్రక్రియలో భాగంగా పులివెందుల పూల అంగళ్ల కూడలి నుంచి నడిపించుకుంటూ పాత బస్టాండ్ వరకు తీసుకొచ్చారు. పోలీసులు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పులివెందుల ప్రజలకు ఈ తీరు కొత్తగా ఉండటమే కాదు.. తమకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరించే వారి పీచమణిగేలా పోలీసుల ట్రీట్ మెంట్ ఉందని చెబుతున్నారు.
అల్లర్లకు పాల్పడే వారికి.. అసాంఘిక శక్తులను వదిలి పెట్టేది లేదంటూ డీఎస్సీ మురళీనాయక్ పేర్కొన్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. పులివెందులలోని పాతబస్టాండ్ వద్ద జగదీశ్ అనే వ్యక్తిపై తిరుపాల్.. మరికొందరు మద్యం మత్తులో దాడి చేశారు. వీరికి గతంలోనూ గొడవలు ఉన్నాయి. తిరుపాల్ - జగదీశ్ మధ్య శత్రుత్వం ఉంది. రెండేళ్ల క్రితం అరటి పండ్ల వ్యాపారంలో హమాలీల సంఘం ఏర్పాటులో వివాదం ఉంది.ఈ నేపథ్యంలో జగదీష్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు.కానీ.. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు.
తాజాగా జగదీష్ తన భార్యతో గొడవలు నెలకొన్న నేపథ్యంలో ఒక బార్ కు వెళ్లి మద్యం తాగుతున్నాడు. అదే సమయంలో తిరుపాల్ అక్కడకు రావటం.. అతడ్ని చూసినంతనే బూతులు తిట్టటంతో.. ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో తిరుపాల్ తన అనుచరులతో కలిసి కర్రలతో దాడి చేశాడు. దీంతో..జగదీష్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొన్న పోలీసులు తిరుపాల్ తో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని.. పులివెందుల రోడ్ల మీద నడిపించారు. అసాంఘిక శక్తుల విషయంలో కరకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్య వినిపిస్తోంది.