"మీలాంటి ముఖ్య‌మంత్రి వ‌స్తార‌ని.. అంబేద్క‌ర్ ఊహించ‌లేదు"

2021లో వెలుగు చూసిన బొగ్గు కుంభ‌కోణంలో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని కేంద్ర‌ద‌ర్యాప్తు సంస్థ‌.. ఈడీ.. ఆరోపించింది.;

Update: 2026-04-23 05:09 GMT

"మీలాంటి ముఖ్య‌మంత్రి వ‌స్తార‌ని.. అంబేద్క‌ర్ ఊహించ‌లేదు".. ఇది ఎవ‌రో రాజ‌కీయ నాయ‌కులు చేసిన వ్యాఖ్య కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు.. ప‌శ్చిమ బెంగాల్ మ‌హిళా ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ఉద్దేశించి చేసిన తాజా వ్యాఖ్య‌లు. అంతేకాదు.. ఉన్న‌త స్థాయి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్న మీరు ఇలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. ఎవ‌రూ ఊహించి ఉండ‌ర‌ని కూడా వ్యాఖ్యానించింది. ఆ సీటును మీరు అవ‌మానించారంటూ పేర్కొంది.

దీంతో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌(గురువారం)కు ముందు.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌లు రాజ కీయంగా మ‌మ‌తా బెన‌ర్జీకి భారీ షాక్ ఇచ్చిన‌ట్టు అయింది. అంతేకాదు.. ఇది బీజేపీకి వ‌జ్రాయుధంగా మారింది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నుంచి ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చిన వెంట‌నే.. బీజేపీ నాయ‌కులు.. ప‌శ్చిమ బెంగాల్ అంతటా.. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ పెట్టాయి. ముఖ్య‌మంత్రి ఎలాంటి వారో ఇప్ప‌టికైనా అర్థ‌మైందా? అని చెప్ప‌డం ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత ప్ర‌భావితం చేసేలా మారింది.

ఏం జ‌రిగింది?

2021లో వెలుగు చూసిన బొగ్గు కుంభ‌కోణంలో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని కేంద్ర‌ద‌ర్యాప్తు సంస్థ‌.. ఈడీ.. ఆరోపించింది. ఈ క్ర‌మంలోనే కేసులు న‌మోదు చేసింది. దీనిలో ప్ర‌ధాన పాత్ర పోషించారంటూ.. అధికార పార్టీ టీఎంసీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ఐప్యాక్ డైరెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌పై కేసు న‌మోదు చేయ‌డంతోపా టు.. కోల్‌క‌తాలోని ఆయ‌న కార్యాల‌యంపైనా అధికారులు దాడులు చేశారు. ఇవ‌న్నీ.. ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందే జ‌రిగాయి. అయితే.. ఇది రాజ‌కీయ దాడి అంటూ.. సీఎం మ‌మ‌త బెన‌ర్జీ ఎదురు దాడి ప్రారంభించారు.

అంతేకాదు.. ఈడీ అధికారుల‌పైన‌.. సీబీఐ అధికారుల‌పైన స్థానిక పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఇక‌, ఈడీ అధికారులు ఐప్యాక్ కార్యాల‌యంలో దాడులు చేసేందుకు వెళ్లిన‌ప్పుడు.. వారిని ప్ర‌భావితం చేసేలా ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌.. స్వ‌యంగా అక్క‌డ‌కు వెళ్లారు. దీనిపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాసనం... సీఎంగా మ‌మ‌త వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఇలాంటి కేసుల‌కు ముఖ్యమంత్రిగా ఉన్న వారు దూరంగా ఉండాల‌ని సూచించింది. ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హ‌రించార‌ని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News