సాయిరెడ్డితో పోలిస్తే.. వైవీ మైనస్సే.. !
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఢిల్లీలో వైసీపీ ఓవెలుగు వెలిగింది.
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఢిల్లీలో వైసీపీ ఓవెలుగు వెలిగింది. పార్టీపరంగా.. నాయకత్వం పరంగా.. ఏం కావాలన్నా చేయించుకున్నారన్న టాక్ ఉంది. పైగా.. కేంద్రంలోని పెద్దలతో సాయిరెడ్డి మంచి ర్యాపో మెయింటెన్ చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేసిందన్న వాదన ఉంది. జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ప్రధానిని కలిసినా.. అవన్నీ సాయిరెడ్డే చూసుకునేవారు. ఒకరకంగా వైసీపీని ఢిల్లీకి అనుసంధానం చేయడంలో సాయిరెడ్డి కీలక రోల్ పోషించారన్నది వాస్తవం.
ఆ తరహా రాజకీయాలు వైసీపీకి బాగానే కలిసి వచ్చాయి కూడా. అయితే.. సాయిరెడ్డి పార్టీని వీడి, రాజీనామా చేసిన తర్వాత.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జగన్.. తన సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డిని వినియోగించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఆయనను రాజ్యసభా పక్ష వైసీపీ నాయకుడిగా కూడా ఎంపిక చేశారు. తద్వారా.. కేం ద్రంతో మంచి సంబంధాలను పెంచుకుంటారని.. పార్టీకిఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని కూడా అంచనా వేసుకున్నారు.
మరి వైసీపీ అధినేత అంచనాలు సఫలమవుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. గత ఏడాదిన్నరగా కేంద్రంతో వైసీపీ సంబంధం అలానే ఉంది. అంతకుమించి ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. పైగా.. ప్రధాని అప్పాయింట్ మెంటును కూడా వైవీ సాధించలేకపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించేం దుకు ఆయన గత వారం ప్రధాని మోడీని కలుసుకోవాలని భావించారు. కానీ, అప్పాయింట్మెంటు దక్కలేదు. గతంలో సాయిరెడ్డి ఎప్పుడు అడిగినా.. మోడీ అప్పాయింట్మెంటు చిటికెలో దక్కేది.
ఇక, సాయిరెడ్డికి.. వైవీకి మరో భారీ వ్యత్యాసం.. ఇతర పార్టీలను సమన్వయం చేసుకోవడం. కాంగ్రెస్ యేతర ప్రతిపక్ష పార్టీలను ఐక్యంగా వైసీపీవైపు తిప్పుకోవడంలో సాయిరెడ్డి ముందున్నారు. అందుకే.. 2024 ప్రారంభంలో జగన్ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇతర రాష్ట్రాల ఎంపీలను.. కాంగ్రెసేతర ప్రతిపక్షాలను సాయిరెడ్డి ఏకం చేసి.. జగన్కు మద్దతుగా మాట్లాడించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా.. వైవీని పెద్దగా ఎవరూ పట్టించుకో వడం లేదు. దీంతో సాయిరెడ్డి లాంటి రాజకీయాలను వైవీ చేయలేకపోతున్నారని వైసీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఆల్టర్నేట్ లేకపోవడంతో ఆయననే కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.