ఐరాస అత్యవసర భేటీ... ఆ విషయంలో కెనడాతో ఏకీభవించిన భారత్!

ఈ సమయంలో ఈ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి తాజాగా ఓటింగ్ నిర్వహించింది. మానవతా దృక్పథంతో సంధి కుదుర్చాలంటూ జోర్డాన్ రూపొందించిన ప్రతిపాదనలపై ఈ ఓటింగ్ ప్రక్రియను చేపట్టింది.

Update: 2023-10-28 13:02 GMT

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయేల్ పై హమాస్ మిలిటెంట్లు దాడులకు పాల్పడటం.. అనంతరం ఇజ్రాయేల్ తీవ్రస్థాయిలో ప్రతిదాడులకు దిగడం మొదలై మూడువారాలు దాటేసింది. ఇందులో భాగంగా ఇజ్రాయేల్ ప్రధాని ప్రకటించినట్లుగానే గాజాని ఐడీఎఫ్ గజ గజ వణికించేస్తోంది.

ఈ సమయంలో ఐరాస అత్యవసర భేటీ ఏర్పాటుచేసింది! ఈ సందర్భంగా కెనడాతో ఏకీభవించిన భారత్... ప్రపంచ దేశాలకు ఒక విషయన్ని స్పష్టం చేసింది. అవును... హమాస్ - ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో గాజాలో భయానక పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గాజాలో ప్రజలు వణికిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలను ఊచకోత కోసిన హమాస్ మిలిటెంట్ల పనికి ఇది ప్రతీకారం అనేది తెలిసిందే!

ఈ సమయంలో ఈ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి తాజాగా ఓటింగ్ నిర్వహించింది. మానవతా దృక్పథంతో సంధి కుదుర్చాలంటూ జోర్డాన్ రూపొందించిన ప్రతిపాదనలపై ఈ ఓటింగ్ ప్రక్రియను చేపట్టింది. దీంతో ఈ మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్న ఈ ఓటింగ్‌ లో ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేయగా.. 14 దేశాలు వ్యతిరేకించాయి.

అయితే అనూహ్యంగా 45 దేశాలు ఓటింగ్‌ లో పాల్గొనలేదు. ఆ 45 దేశాల్లో భారత్ కూడా ఒకటి కాగా.. మిగిలినవాటిలో కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్, ఉక్రెయిన్, జర్మనీ లు ఉన్నాయి. అయితే ఈ ఓటింగ్ లో భారత్ తో సహా ఈ దేశాలన్నీ పాల్గొనకపోవడానికి ఒక కీలకమైన కారణం ఉంది.

Read more!

ఈ ప్రతిపాదనలో ఇజ్రాయేల్ చేస్తున్న దాడులవల్ల గాజాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ప్రస్థవించడానికంటే ముందు... ఇజ్రాయెల్‌ పై తొలుత రాకెట్ దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ ను టెర్రరిస్టులుగా గుర్తించాలనేది భారత్ అభిప్రాయంగా ఉందని అంటున్నారు. అయితే... ఐరాసలో ఊహించనివిధంగా.. హమాస్ గు రించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో ఈ ప్రతిపాదనను భారత్ తప్పుపట్టింది.

మరోపక్క కెనడా కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సవరణలు సూచించింది. ఇందులో భాగంగా... "ఇజ్రాయెల్‌ పై హమాస్ ఉగ్రవాదుల దాడులు" అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలని కోరింది! ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌ లో పాల్గొంటామని సూటిగా చెప్పింది. దీంతో... కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది!

దీంతో... కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఐరాసా అంగీకరించింది.. ఇందులో భాగంఘా ఓటింగ్ సైతం నిర్వహించింది. అయితే... ఈ సవరణలకు అనుకూలంగా భారత్‌ సహా 87 దేశాలు ఓటు వేశాయి. ఇలా మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ప్రతిపాదన ఆమోదం పొందలేకపోయింది.

Tags:    

Similar News