తమిళ రాజకీయాల్లో 'సనాతన' సెగ: ఉదయనిధి బాటలో టీవీకే ఎమ్మెల్యే

తాను సనాతన ధర్మాన్ని అంతం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానంటూ ముస్తాఫా సంచలన ప్రకటన చేశారు. దీంతో బీజేపీతో సహా హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

Update: 2026-05-14 08:30 GMT

తమిళనాడు రాజకీయాలు మరోసారి 'సనాతన ధర్మం' చుట్టూ తిరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెండు రోజుల క్రితం విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే ముస్తఫా తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను సనాతన ధర్మాన్ని అంతం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానంటూ ముస్తాఫా సంచలన ప్రకటన చేశారు. దీంతో బీజేపీతో సహా  హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ పెరియార్, అంబేడ్కర్ సిద్ధాంతాలే పునాదిగా సనాతన ధర్మ నిర్మూలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలోనే విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం నిర్మూలించాలంటూ పిలుపునిచ్చారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి విజయ్ విపక్ష నేత ఉదయనిధి మాటలను ఖండించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయనిధి మాటలను వింటూ ముఖ్యమంత్రి ఎలా మౌనంగా ఉండిపోయారంటూ పలువురు ప్రశ్నలు సంధించారు. ఈ వివాదాం ఇలా కొనసాగుతుండగానే టీవీకే పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా కూడా అటువంటి తీవ్ర వ్యాఖ్యలే చేయడం, పైగా సనాతన ధర్మం నిర్మూలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీవీకే ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించడమో లేక సమర్థించడమో జరగలేదని అంటున్నారు. దీంతో సనాతన ధర్మంపై ముఖ్యమంత్రి విజయ్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సనాతన ధర్మం నిర్మూలిస్తామంటే మౌనం పాటిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ అదే సమయంలో క్రిస్టియానిటీని నిర్మూలిస్తే చూస్తూ ఊరుకుంటారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ రియాక్షన్

కాగా, ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘అన్ని మతాలను గౌరవిస్తాం’ అనే నినాదం కేవలం ముసుగు మాత్రమేనని, అసలు ఉద్దేశం హిందూ ధర్మాన్ని లక్ష్యం చేసుకోవడమేనని టీవీకే ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్, డీఎంకేతోపాటు ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే ముసుగు కూడా తొలిగిపోయిందని, అంతా కలిసి ఒక వర్గం ఓట్ల కోసం మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ‘సనాతన ధర్మంపై యుద్ధం ముదురుతోందనే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మత విశ్వాసాలకు చెందిన అంశంపై వివాదం చెలరేగడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి విజయ్ ఎలా ముగిస్తారో చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News