అమెరికా ఉత్పత్తులు వస్తే.. భారత రైతులకు పెద్ద దెబ్బ పడుతుంది : శరద్ పవార్
ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ తో ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులు నష్టపోతారని అంచనా వేశారు.;
ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ తో ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులు నష్టపోతారని అంచనా వేశారు. డీల్ కు సంబంధించి ఇంకా పూర్తీ స్థాయి సమాచారం అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే అర్థమవుతోందని అన్నారు. భారత ఎగుమతులపై టారిఫ్ తగ్గించడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా భవిష్యత్తులో భారత రైతులు నష్టపోతారని పవార్ అంచనా వేశారు. అమెరికా లాంటి బలమైన దేశం తమ వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తరలిస్తే.. అనివార్యంగా ఆ ప్రభావం రైతులపైన ఉంటుందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
రైతులు ఎలా నష్టపోతారు ?
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్ లోకి వస్తే.. ఇక్కడి వాటికి డిమాండ్ తగ్గుతుంది. లేదా ధర పడిపోతుంది. నాణ్యతను బట్టి మార్కెట్ డిమాండ్ ఉంటుంది. ఒకవేళ అమెరికన్ ఉత్పత్తులు మన కంటే నాణ్యంగా ఉంటే వాటికే ధర ఉంటుంది. డిమాండ్ ఉంటుంది. అప్పుడు మన ఉత్పత్తులకు డిమాండ్ ఉండదు. ధర పలకదు. ఫలితంగా రైతులకు గిట్టుబాటు కాదు. దీంతో రైతు పంటను అమ్ముకోలేడు. పెట్టుబడిని నష్టపోతాడు. అప్పుల్లోకి నెట్టబడతాడు. ఆత్మహత్యలకు కారణం అవుతుంది. ఇలా క్రమంగా రైతును అమెరికన్ ఉత్పత్తులు నిలువునా ముంచేస్తాయి. దీన్ని అంచనావేసే శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అమెరికా లాంటి బలమైన దేశం తన ఉత్పత్తులను భారత్ లోకి ఎగుమతి చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారు.
మొక్కజొన్న, పత్తి..
ఉదాహరణకు మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు మనదేశంలోనూ ఉన్నాయి. కానీ ఇక్కడ ధరలేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి దిగుమతి చేసుకుంటే.. ఇక్కడి పంటను ఎవరు కొంటారు అన్నది ప్రశ్న. అయితే ఈ ప్రభావాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అన్నది మరొక ప్రశ్న. అమెరికాతో పోల్చితే మనదేశమే వ్యవసాయంపై అధికంగా ఆధారపడి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులు మన మార్కెట్లోకి వస్తే.. అది మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది అన్నదానిపై భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. గతంలో జన్యు మార్పులతో ఉన్న పంటలను ఇండయా ఆనుమతించలేదు. ఇప్పుడు కూడా అనుమతించబోదు. కానీ మనదేశంలోనే కొనేవారు లేక పంటకు గిట్టుబాటు దక్కకపోతే... అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ప్రశ్న ఉంది. తలుచుకుంటే రైతు పరిస్థితి దీనంగా మారుతుందని అర్థమవుతోంది. కానీ ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా ఎదుర్కొని రైతులకు నష్టం లేకుండా చేయగలిగితే ట్రేడ్ డీల్ సక్సెస్ అయినట్టే. లేదంటే రైతుల నుంచి మరో ఉద్యమం ఎదుర్కోక తప్పదు.
ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా ?
అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతి ఇవ్వడం ద్వారా జరిగే నష్టాన్ని పూడ్చే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందా అన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే అమెరికాన్ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ లాంటి పెద్ద మార్కెట్ కావాలి. మనకూ అమెరికా మార్కెట్ కావాలి. అదే సమయంలో దేశీయ ఉత్పత్తి రంగాలు నష్టపోకూడదు. ఇదే దేశానికి మంచిది. అమెరికా కూడా ఇదే తరహా ప్రణాళికతో ఉంది. దేశీయంగా ఉన్న ఉత్పత్తి రంగాలు నష్టపోకుండా.. అవసరమైన వాటినే దిగుమతి చేసుకుంటోంది. అదే వ్యూహం భారత్ అనుసరిస్తే ఇబ్బంది ఉండదు. కానీ ఒక రంగంలో అభివృద్ధి కోసం ఇంకో రంగ అభివృద్ధిని పణంగా పెట్టకూడదు.