రవి ప్రకాష్ స్టడీ... బీజేపీకి అనుకూలమా ?

తెలుగులో ఇరవై నాలుగు గంటల పాటు వార్తలు అని తొలి శాటిలైట్ న్యూస్ చానల్ ని తెచ్చిన ఘనత కూడా ఆయనదే.

Update: 2024-05-04 14:30 GMT

రవి ప్రకాష్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం లో తనదైన ముద్ర వేసుకున్న వారు. ఆయన ఒక ప్రముఖ చానల్ లో ఉన్నపుడు ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. తెలుగులో ఇరవై నాలుగు గంటల పాటు వార్తలు అని తొలి శాటిలైట్ న్యూస్ చానల్ ని తెచ్చిన ఘనత కూడా ఆయనదే.

ఆయన ఈ మధ్య ఒక యూట్యూబ్ చానల్ ని నడుపుతూ వస్తున్నారు. ఆ చానల్ కొంత అగ్రెసివ్ మోడ్ లో వెళ్తున్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వెళ్తోంది అని అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ఈ చానల్ పూర్తిగా మద్దతుగా సాగుతోంది అని కూడా ప్రచారం అయితే ఉంది.

ఇక తాజాగా రవి ప్రకాష్ తన చానల్ ద్వారా చేయించిన సర్వే అయితే కొంత చర్చకు దారి తీస్తోంది. . ఆయన సర్వే ఫలితాలలో చూస్తే కనుక తెలంగాణాలో ఎంపీ సీట్లు బీజేపీకే ఎక్కువ వస్తాయని వెల్లడించడం జరిగింది. అంతే కాదు ఏపీలో బీజేపీ కూటమికే మొత్తం అనుకూలంగా ఉంది అని కూడా రవి ప్రకాష్ సర్వే లో చెప్పుకొచ్చారు.

దీని మీద ఇపుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేస్తున్నారు. రవి ప్రకాష్ ఈ స్టడీ అయినా సర్వే అయినా చేయించడానికి తీసుకున్న శాంపిల్స్ ఏమిటి ఆయన వద్ద అంత నెట్ వర్క్ ఎలా ఉంది అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తెలంగాణాలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు కట్టబెడుతూ అదే ట్రెండ్ ని ఏపీలో కూడా కంటిన్యూ చేయడంతో ఈ రెండు రాష్ట్రాల్లో రవి ప్రకాష్ స్టడీ చూసిన వారు ఇదేదో అనుకూలంగా చేసిన సర్వే అని అంటున్నారు.

Read more!

ఇదిలా ఉంటే రాయలసీమలోని మొత్తం కర్నూల్ కడప చిత్తూరు, అనంతపురం లో 52 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 2019లో వైసీపీకి 49 వచ్చాయి. తెలుగుదేశానికి మూడు వచ్చాయి. కానీ ఈసారి తెలుగుదేశానికి ఏకంగా 22 సీట్లు వస్తాయని చెప్పడం కొంత అతిశయోక్తిగానే ఉంది అని అంటున్నారు. అలాగే వైసీపీకి పట్టున్న చోట్లనే టీడీపీ పాగా అని చెప్పడమే కానీ కొన్ని చోట్ల టైట్ ఫైట్ ఉన్న సీట్లలో భారీ ఆధిక్యతలు కూడా కూటమి అభ్యర్ధులకు కట్టబెట్టడంతో రవి ప్రకాష్ మార్క్ స్టడీ మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు.

కొందరు అయితే మరి కాస్త ముందుకు వెళ్ళి ఇది 2019 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే మాదిరిగా పోలి ఉందని అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేకపోగా బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. ఆనాడు లగడపాటి సర్వేను నమ్ముకున్న మీదటనే టీడీపీ రిలాక్స్ అయిందని గ్రౌండ్ లో మొత్తం కొలాప్స్ అయిందని కూడా గుర్తు చేస్తున్నారు.

అయినా ఈ స్టడీస్ కి సర్వేలకు ఉన్న సైటిఫిక్ మెథడాలజీ ఏమిటి అన్న చర్చ కూడా ముందుకు తెస్తున్నారు. రవి ప్రకాష్ మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన యూ ట్యూబ్ చానల్ ని శాటిలైట్ న్యూ చానల్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు.

దాంతో ఈ స్టడీ ద్వారా మరోసారి రాజకీయ సంచలనాలకు తెర తీయాలని భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఏ సర్వే అయినా ఏ స్టడీ అయినా క్రెడిబిలిటీ ఉండేలా ఉంటేనే జనాలు పట్టించుకుంటారని లేకపోతే టైం పాస్ గా చూసి వదిలేస్తారు తప్ప ఏమీ కాదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే రవి ప్రకాష్ స్టడీని లైట్ తీసుకుంటూ ట్రోల్స్ చేసే వారే ఎక్కువ అయ్యారని అంటున్నారు.

Tags:    

Similar News