రఘురామ చెప్పినట్లు చంద్రబాబు చేస్తారా? రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్

ప్రస్తుతం ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదన్న విషయం రుఘురామ కమిటీ దృష్టికి వచ్చింది.;

Update: 2025-06-05 04:40 GMT
రఘురామ చెప్పినట్లు చంద్రబాబు చేస్తారా? రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నేత రఘురామకృష్ణంరాజు. 2019-24 మధ్య వైసీపీ ఎంపీగా పనిచేసిన రఘురామ సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాజకీయంగా ప్రాచుర్యం పొందారు. వైసీపీ ప్రభుత్వం ఎంత అణచివేస్తే.. అంత ఎత్తుకు ఎదిగిన రఘురామ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉప సభాపతిగా అసెంబ్లీని తనదైన స్టైల్ లో నడుపుతున్న రఘురామ.. శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ గానూ బాధ్యతలు తీసుకున్నారు. వాస్తవానికి ఈ శాసనసభ కమిటీకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, రఘురామ రాజు చైర్మన్ గా ఉండటంతో కమిటీ పనితీరుపై అందరూ ఆసక్తి చూపుతున్నారు.

శాసనసభ పిటిషన్ల కమిటీలో రఘురామరాజుతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రులు గంటాతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రఘురామరాజు ఆధ్వర్యంలోని అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ప్రజల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాల్సిన బాధ్యత కమిటీలోని శాసనసభ్యులపై ఉంది. కమిటీ చైర్మనుగా రఘురామ మరింత బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం శాసనసభ హాలులో భేటీ అయిన రఘురామ కమిటీ.. ఓ కీలక సూచన చేసింది. రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలను ప్రభావితం చేసే ఆ సూచనను ప్రభుత్వం.. ముఖ్యంగా సీఎం చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నదే చర్చకు దారితీస్తోంది.

ప్రస్తుతం ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదన్న విషయం రుఘురామ కమిటీ దృష్టికి వచ్చింది. రేషన్ బియ్యం బదులు వారు బయట మార్కెట్ లో లభించే సన్నబియ్యం వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్కువమంది రేషన్ బియ్యం వినియోగించకపోవడం వల్ల రేషన్ డిపోల వద్దే విక్రయిస్తున్నారని కమిటీ గుర్తించింది. దీనివల్ల అక్రమ రవాణాకు అస్కారం కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు. అయితే రేషన్ బియ్యం అవసరం లేకపోయినా, కార్డు తీసుకోడానికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుకు రేషన్ కార్డుకు లింకు ఉండటమేనని రఘురామ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితి నివారించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే రేషన్ కార్డు- ఎన్టీఆర్ వైద్యసేవ కార్డుకు ఉన్న లింకు తొలగించాలని ప్రభుత్వానికి సూచించాలని రఘురామ రాజు నిర్ణయించారు.

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు మంజూరు చేయడం వల్ల, రేషన్ వినియోగించని కార్డులను వెనక్కి తీసుకోవచ్చని, ఫలితంగా ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్లు ఆదా అవుతుందని రఘురామరాజు చెబుతున్నారు. రేషన్ బియ్యం తీసుకోని వారికి డబ్బు పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికి ఆహార భద్రత చట్టం వల్ల అది సాధ్యం కాదని అంటున్నారు. దీనివల్ల రేషన్ సరుకులు అవసరం లేని వారికి కూడా ఉచిత వైద్యంపై భరోసా కల్పిస్తే రేషన్ కార్డులు తగ్గించి, ప్రభుత్వ ధనం ఆదా చేయొచ్చని ప్రతిపాదనపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే రాజకీయంగా చాలా చిక్కులు ఎదురయ్యే ఈ సూచనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News