బాబుపై మోడీ ప్రశంసల జల్లులు... 'పవన్ జీ'కి బిగ్ టాస్క్!

ఈ సందర్భంగా... ఇంద్రలోకం రాజధాని.. అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే అని.. ఇది స్వర్ణాంద్రప్రదేశ్ నిర్మాణానికి శుభ సంకేతమని మోడీ అన్నారు.;

Update: 2025-05-02 13:38 GMT
బాబుపై మోడీ ప్రశంసల జల్లులు... పవన్  జీకి బిగ్ టాస్క్!

అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ సుమారు రూ.60 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో మొత్తం 18 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా అమరావతి, పోలవరంతో పాటు మరిన్ని కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. డెడ్ లైన్స్ ఫిక్స్ చేశారు!

అవును... అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా... దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని, రాష్ట్రంలో కనెక్టివిటీ విషయంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తొలుత తెలుగులో ప్రసంగించారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగా... "అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా, అధునాతన్ ప్రదేశ్ గా మార్చే శక్తి" అని ప్రధాని మోడీ తెలుగులో మాట్లాడారు. ఆ సమయంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

చంద్రబాబుపై ప్రశంసల జల్లులు!:

అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమంలో ప్రధాని మోడీ తన ప్రసంగంలో చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా... తాను గుజరాత్ సీఎం అయినతర్వాత హైదరాబాద్ లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నట్లు మోడీ తెలిపారు. దీనికోసం అధికరుల్ని పంపించి హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించినట్లు చెప్పారు.

ఇదే సమయంలో... పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నా అది చంద్రబాబుకే సాధ్యమని చెప్పిన మోడీ... ఈ విషయంలో చంద్రబాబుని మించిన నేత దేశంలో లేరని అన్నారు. ఇదే సమయంలో... అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని.. అమరావతిలోని అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలి పవన్ జీ!:

ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్ల రూపాయలు సాయం చేస్తోందని చెప్పిన ప్రధాన్ని మోడీ.. ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలలు గన్నారని, వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని అంటూ.. ఇది మనం చేయాలి పవన్ కల్యాణ్ గారూ అని అన్నారు. అమరావతి అంటే ఒక నగరం మాత్రమే కాదని.. ఒక స్వప్నం సాకారం కాబోతోందనే భావన కలుగుతోందని అన్నారు.

సుమారు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని.. అయితే, అవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కావని.. ఏపీ ఆశలు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులు అని ప్రధాని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో.. పోలవరం ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, రైతులకు మంచి రోజులు తీసుకొస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్ చాలా విషయాల్లో దేశం గర్వపడేలా చేస్తోందని.. ఇక్కడి శ్రీహరి కోట నుంచి ప్రయోగించే ప్రతీ రాకెట్ చరిత్రలో నిలిచిపోతోందని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పిన మోడీ.. చంద్రబాబు, పవన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇంద్రలోకం రాజధాని అమరావతే!:

ఈ సందర్భంగా... ఇంద్రలోకం రాజధాని.. అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే అని.. ఇది స్వర్ణాంద్రప్రదేశ్ నిర్మాణానికి శుభ సంకేతమని మోడీ అన్నారు. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతి అని.. అమరావతి అని అంటే అది ఒక నగరం కాదని.. అది ఒక శక్తి అని ప్రధాని తెలిపారు.

జూన్ 21న విశాఖకు మోడీ!:

ఈ క్రమంలో... జూన్ 21న విశాఖలో జరగనున్న యోగా డేలో తాను పాల్గొంటానని చెప్పిన మోడీ.. ఈ సందర్భంగా తనను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలని.. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని మోడీ తెలిపారు.

Tags:    

Similar News