జనసేనకు అలాంటి వారే కావాలి: పవన్
''జనసేన పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని.. తమ కోసం కాకుండా సమాజం కోసం.. ఈ దేశం కోసం నిలబడే వారే నాకు కావాలి.'' అని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.;
''జనసేన పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని.. తమ కోసం కాకుండా సమాజం కోసం.. ఈ దేశం కోసం నిలబడే వారే నాకు కావాలి.'' అని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కేవలం 150 మందితో ప్రారంభమైన జనసేన పార్టీలో.. ఇప్పుడు 14 లక్షల మంది ఉన్నారని తెలిపారు. రోజు రోజు కు పార్టీ అభివృద్ది చెందుతోందని.. అదే సమయంలో భావజాలాన్ని కూడా అర్థం చేసుకునే నాయకులు ఎదగాలని ఆయన సూచించారు.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం (మంగళగిరి)లో పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి.. జనసేన తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం.. పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేదిశగా ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు.
''నాయకుడు ఉన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు.. అనే పరిస్థితిని విడిచిపెట్టండి. మీ వంతుగా పార్టీకి ఏం చేశారు? ప్రజలకు ఏం చేశారు? అనే విషయాలను భేరీజు వేసుకుని ఆదిశగా అడుగులు వేయండి'' అని పవన్ కోరారు. పార్టీలో తాను కూడా సాధారణ కార్యకర్తనేనని.. వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
పార్టీలో కొత్త పేర్లు..
జనసేనలో వివిధ విభాగాలకు సంబంధించి పనిచేస్తున్న కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కొత్త పేర్లు సూచించారు.
1) ఉద్యమి: పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని.. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని 'ఉద్యమి'గా పిలుస్తారు.
2) సాధక్: జనసేన పోరాటానికి మరింత బలం అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి, పార్టీ సభ్యత్వం నమోదు చేసేవారిని 'సాధక్'గా పిలుస్తారు.
3) ప్రదాత: పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందించే వారిని ‘ప్రదాత’గా పిలవ నున్నారు.