అకీరా ఫ్రెండ్ కూడా కాక్రోచ్ పార్టీనే.. 'సీజేపీ'పై జనసేనాని పవన్ ఆసక్తికర విశ్లేషణ!
ఆన్లైన్ వేదికగా ట్రెండ్ అవుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'పై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆన్లైన్ వేదికగా ట్రెండ్ అవుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'పై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'జెన్ జీ (Gen Z)' యువత ఆలోచనా విధానం వల్లే కాక్రోచ్ జనతా పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని విశ్లేషించారు. తన కుమారుడు అకీరా నందన్ ఫ్రెండ్ కూడా కాక్రోచ్ పార్టీని ఫాలో అవుతున్న విషయాన్ని పవన్ వెల్లడించారు. ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన జనసేన అధినేత నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో రాజకీయాలతో పాటు నేటి తరం యువత ఆలోచనలు, వారి ఆకాంక్షల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
‘నా కొడుకు ఫ్రెండ్స్ కూడా అందులోనే..!
ప్రతి 20 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుందని పవన్ తెలిపారు. ఆ తరానికి తగినట్లు ఆశలు, ఆకాంక్షలు కూడా మారుతుంటాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో తన కుమారుడి ప్రస్తావన తీసుకువచ్చారు పవన్. ‘‘నా కుమారుడికి ఒక 20 మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ముగ్గురు ఆన్లైన్ వేదికగా ఉన్న 'కాక్రోచ్ జనతా పార్టీ'లో చేరారు" అని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీలో చేరిన యువత కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. వారికి నచ్చని సామాజిక, రాజకీయ అంశాలపై మాట్లాడటానికి, తమ అసంతృప్తిని వెళ్లగక్కడానికి వేదికగా దొరికింది. కానీ దశ, దిశా లేని కోపం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు.’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
జెన్ జీ యువత సాంప్రదాయ రాజకీయ విమర్శలకు, కుల-మత ఘర్షణలకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా జెన్ జీ యువతతో భేటీ అయ్యారు. వారి ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిరంతరం జరిగే గొడవలు, ఒకరిపై ఒకరు చేసుకునే వ్యక్తిగత దూషణల రాజకీయాలను యువత ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ప్రశాంతమైన, అభివృద్ధి మార్గంలో సాగే రాజకీయ వాతావరణాన్ని ఆశిస్తున్నారని అంటున్నారు.
గొడవలు సృష్టించే నాయకులు కాకుండా, నిరుద్యోగం, పర్యావరణం, కనీస వసతుల వంటి క్షేత్రస్థాయి సమస్యలను ప్రాక్టికల్గా పరిష్కరించే లీడర్స్ కావాలని జెన్ జీ గట్టిగా డిమాండ్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కాక్రోచ్ పార్టీకి తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా తమ భావాలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా పంచుకోవడానికి, వ్యవస్థపై ఉన్న కోపాన్ని లేదా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యువత సరికొత్త డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు.