భువనేశ్వరి రాజకీయాల్లోకి...జోస్యం ఆమెది ?

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, మంత్రి నారా లోకేష్ తల్లి అయిన నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే ఆమె వస్తారు అని అంటున్నారు లక్ష్మీ పార్వతి.

Update: 2026-07-31 18:13 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, మంత్రి నారా లోకేష్ తల్లి అయిన నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే ఆమె వస్తారు అని అంటున్నారు లక్ష్మీ పార్వతి. మా అమ్మాయి భువనేశ్వరి అంటూ ఆమె తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆమె మీద విమర్శలు చేశారు. అయితే ఇటీవల కాలంలో భువనేశ్వరి పర్యటనలలో పెరిగిన వేగం, ఆమె చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అనిపిస్తోంది అని లక్షీపార్వతి అంటున్నారు.

స్వాగతం అంటూనే :

అయితే భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతం అని లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె ఎన్టీఆర్ కుమార్తెగా ఆయన పాలనను తీసుకుని రాలేని చంద్రబాబు ప్రభుత్వం చేసే తప్పులకు క్షమాపణ చెప్పి అపుడు రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి కండిషన్ పెట్టారు. ఏపీలో చంద్రబాబు పాలనను వెనకేసుకుని వస్తున్న భువనేశ్వరి ఆనాడు తన తండ్రి ఎన్టీఆర్ స్వచ్చమైన పాలనకు మద్దతు ఇచ్చి ఉంటే ఆయన ఈ రోజుకీ జీవించి ఉండేవారు కదా అని లక్ష్మీపార్వతి కామెంట్స్ చేశారు. ఏపీలో హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని కానీ అన్ని హామీలు అమలు చేసిన నాయకుడిగా చంద్రబాబు గురించి భువనేశ్వరి చెప్పడం విడ్డూరం అని లక్ష్మీపార్వతి అంటున్నారు.

నిజంగా జరిగేనా :

లక్ష్మీపార్వతి అన్నారని కాదు కానీ నిజంగా భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఆమె ఇటీవల ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో విపక్ష వైసీపీ మీద నర్మ గర్భ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను మెచ్చుకుంటున్నారు. మహిళల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాంతో ఆమె పొలిటికల్ గా రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా అన్న చర్చ నడుస్తోంది.

మూడవ వంతు వారికే :

మరో వైపు చూస్తే దేశంలో మహిళలకు మూడవ వంతు సీట్లు రిజర్వ్ అయ్యేలా మహిళా చట్టం 2029 ఎన్నికల నుంచి అమలు చేస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగితే కచ్చితంగా మహిళా నాయ్కుల అవసరం మరింత పెరుగుతుంది. భువనేశ్వరి లాంటి వారు ఇప్పటికే రాజకీయ కుటుంబానికి చెందిన వారు అవగాహన ఎక్కువగా ఉన్న వారు. ఆమె తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు. భర్త చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కుమారుడు లోకేష్ రెండవ మారు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పొలిటికల్ ఎంట్రీ మీద వేచి చూడాల్సి ఉంది. :

గతంలో సోదరుడు హరికృష్ణ ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో సోదరుడు బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి కొనసాగుతున్నారు. ఇంకో సోదరి పురంధేశ్వరి మూడు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఇలా చెబుతూ పోతే భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తే మంచి అవకాశాలే ఉంటాయని అంటున్నారు. మరి ఆమె ఆలోచనలు ఏమిటో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 2029 ఎన్నికలు మహిళలక్ అగ్ర తాంబూలాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. అలాంటి చాన్స్ ఎక్కువగా పాపులర్ పొలిటికల్ పార్టీలలో ఉన్న కుటుంబాలు ఉపయోగించుకుంటాయి. ఎందుకంటే వారికి అవి అందివచ్చిన అవకాశాలు అవుతాయి కాబట్టి అంటున్నారు. సో భువనేశ్వరి పొలిటికల్ ఎంట్రీ మీద వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News