జూబ్లీహిల్స్‌లో టీడీపీ సానుభూతి పరుల ఓటు ఎవరికీ?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.;

Update: 2025-11-05 12:10 GMT

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొనడం, మంత్రులను బరిలోకి దించడం వల్ల పోటీ హోరాహోరీగా మారింది. ప్రతి వర్గం ఓటు కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుల మద్దతు ఇప్పుడు ‘కింగ్ మేకర్’ పాత్ర పోషిస్తోంది.

* టీడీపీ సానుభూతి ఓటర్లు ఎవరి వైపు?

జూబ్లీహిల్స్‌ పరిధిలో టీడీపీ, జనసేనకు చెందిన సానుభూతి పరుల సంఖ్య గణనీయంగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఈ వర్గం రేవంత్‌ రెడ్డికి మద్దతుగా నిలిచింది. ఆ తరహా మద్దతు ఇప్పుడు కూడా కొనసాగుతుందా? లేక బీజేపీకి మారుతుందా? అన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తెలంగాణలో బీజేపీకి అధికారిక మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం పార్టీ ప్రకటించలేదు. అయితే, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

* కమ్మ వర్గ ఓట్లు కీలకం

జూబ్లీహిల్స్‌లో కమ్మ వర్గ ఓటర్లు దాదాపు 22 వేల మంది ఉన్నారు. ఈ వర్గం ఏ దిశగా కదులుతుందన్నదే ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో ఉంది. గతంలో మాగంటి గోపినాథ్‌ టీడీపీ తరఫున గెలిచి, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరినా, ఆయనకు కమ్మ వర్గం నుంచి బలమైన మద్దతు లభించింది.

ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కమ్మ నేతలతో భేటీ అవడం, మైత్రీవనం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలన్న వారి కోరికకు అంగీకరించడం వంటి చర్యలు ఈ వర్గం మనసు గెలుచుకున్నట్టు కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కమ్మ నేతలతో సమన్వయం చేస్తూ కాంగ్రెస్‌ తరఫున కమ్మ వర్గ ఓట్లు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

* బీఆర్‌ఎస్‌-బీజేపీ ప్రయత్నాలు

కమ్మ వర్గం కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతోందన్న అంచనాలతో బీఆర్‌ఎస్‌ నేతలు అలర్ట్‌ అయ్యారు. తమ పార్టీకి చెందిన కమ్మ వర్గ నాయకులను రంగంలోకి దింపారు. బీజేపీ కూడా ఈ వర్గాన్ని ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. టీడీపీ సానుభూతి పరులు, సినీ పరిశ్రమ, సెటిలర్లు ఈ ముగ్గురి ఓటు బలాన్ని గెలుచుకోవడమే ఇప్పుడు మూడు పార్టీల ప్రధాన లక్ష్యం.

* ఫలితమే చెప్పాలి

ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో టీడీపీ సపోర్టర్స్‌, కమ్మ వర్గం, సినీ ప్రముఖులు ఎవరి వైపు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున సమీకరణాలు బలపరిచినప్పటికీ, బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కూడా చివరి నిమిషం వరకు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి.

నవంబర్‌ 14న వెలువడే ఫలితాలు ఈ ఉప ఎన్నికలో ఎవరి వ్యూహం సక్సెస్‌ అయిందో, టీడీపీ సానుభూతి పరులు ఎటు మొగ్గుచూపారో తేల్చి చెబుతాయి.

మొత్తానికి జూబ్లీహిల్స్‌ ఫలితం తెలంగాణ రాజకీయాలకు దిశా నిర్దేశం చేసేలా ఉండనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News