కేరళ సరే.. స్టేట్ లెవిల్లో జనసేన పరిస్థితేంటి ..!
ఏపీలో మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయిలో అసలు జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ తరఫున గళం వినిపించే నాయకులు ఎంత మంది ఉన్నారు.;
జనసేన పార్టీ ఇటీవల కేరళలో విస్తరించింది. అక్కడ దాదాపు ఒక 200 మందికి పైగా ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకుని కండువాలు కప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. ఏ పార్టీ అయినా విస్తరించడం ఎవరు కాదనరు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే ఎంత బాగుంటుంది. అంతగా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అయితే వాస్తవం ఏంటంటే ఎక్కడో ఉన్న కేరళలో జనసేన విస్తరించిందా లేదా అనేది పక్కన పెడితే అసలు సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? అనేది చర్చ.
ఏపీలో మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయిలో అసలు జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ తరఫున గళం వినిపించే నాయకులు ఎంత మంది ఉన్నారు.. అనే లెక్క చూస్తే వేళ్ళ మీదే లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికి బూత్ స్థాయి నాయకత్వాన్ని జనసేన డెవలప్ చేయలేకపోయింది. అందుకే గత ఎన్నికల్లో టిడిపికి చెందిన బూత్ స్థాయి నాయకుల్ని జనసేన వినియోగించుకోవలసి వచ్చింది. అప్పటినుంచి పార్టీలో ఈ వ్యవహారంపై చర్చ నడుస్తోంది.
పార్టీలో మండల గ్రామ బూత్ స్థాయి నాయకులను పెంచాలనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ ఈ విషయంపై తరచుగా చర్చలు నడుస్తున్న సంబంధిత చర్యలు అయితే కనిపించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులే పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించే స్థితి ఉంది.. తప్ప వ్యక్తిగతంగా పార్టీకి వస్తున్న మద్దతు తక్కువగానే ఉందన్నది వాస్తవం. ముందు స్టేట్ లెవెల్ పాలిటిక్స్ లో వైసీపీ తరహాలో టిడిపి తరహాలో జనసేన కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నది రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ.
అంతే కాదు క్షేత్రస్థాయిలో బలం లేని పార్టీ విఫలమవుతుందే తప్ప సఫలం కాని పరిస్థితులు కనిపిస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా జనసేన క్షేత్రస్థాయిలో డెవలప్ కావాల్సిన అవసరం ఉందని ఆ దిశగా అడుగులు వేయాలని పార్టీ నాయకులు సైతం కోరుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తే జనసేన బలపడుతుందని చెబుతున్నారు. ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల్లో డెవలప్ చేయడంపై ఎవరికి అభ్యంతరం లేదని కూడా అంటున్నారు.