రూ.40 వేల కోట్ల ఒమన్-భారత్‌ గ్యాస్ పైప్‌లైన్‌కు గ్రీన్ సిగ్నల్!

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అనిశ్చితి, గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు అత్యంత సాహసోపేతమైన అడుగు వేస్తోంది.

Update: 2026-05-15 10:45 GMT

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అనిశ్చితి, గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు అత్యంత సాహసోపేతమైన అడుగు వేస్తోంది. పశ్చిమాసియా దేశాల నుంచి సహజ వాయువును నేరుగా భారత్‌కు చేరవేసేందుకు ఉద్దేశించిన "మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్ వాటర్ పైప్‌లైన్" ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు రూ. 40,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, దేశ ఇంధన ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసే "గేమ్ చేంజర్"గా అభివర్ణించబడుతోంది.

సాంకేతిక అద్భుతం.. సముద్ర గర్భంలో 2,000 కి.మీ ప్రయాణం

ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక పైప్‌లైన్ మాత్రమే కాదు.. ఇది ప్రపంచ ఇంజనీరింగ్ రంగంలోనే ఒక విస్మయం. ఒమన్ తీరం నుంచి గుజరాత్‌లోని ముంద్రా లేదా పోర్‌బందర్ తీరాన్ని అనుసంధానించే ఈ పైప్‌లైన్ పొడవు సుమారు 2,000 కిలోమీటర్లు. అరేబియా సముద్రం అడుగున దాదాపు 3,450 మీటర్ల లోతులో దీనిని నిర్మించనున్నారు. ఇంతటి లోతైన సముద్ర గర్భంలో పైప్‌లైన్ నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి కానుంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ 31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును భారత్‌కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

హార్ముజ్ చిక్కుముడికి శాశ్వత పరిష్కారం

ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న సహజ వాయువులో సింహభాగం హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తోంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ మార్గం ఎప్పుడూ ప్రమాదపు అంచునే ఉంటోంది. ఈ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు అమాంతం పెరిగి, భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. సాధారణంగా 10 డాలర్లు ఉండే యూనిట్ ధర, యుద్ధ మేఘాల వల్ల 25 డాలర్ల వరకు చేరుతోంది. ఈ అండర్ వాటర్ పైప్‌లైన్ పూర్తయితే హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా నేరుగా గ్యాస్ దిగుమతి చేసుకోవచ్చు. ఇది రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, సరఫరాలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

చైనాకు ధీటుగా.. ఇంధన నిల్వల వేటలో భారత్

ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తరుణంలో ఇంధన భద్రతలో చైనా సాధించిన ప్రగతి భారత్‌కు ఒక సవాలుగా మారింది. రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి భూమార్గం ద్వారా పైప్‌లైన్లను నిర్మించుకున్న చైనా 2026 నాటికి 80 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వ సామర్థ్యాన్ని అందుకోనుంది. ప్రస్తుతం భారత్ వద్ద కేవలం 10-12 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో గెయిల్ , ఐఓసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దింపిన కేంద్ర పెట్రోలియం శాఖ, త్వరితగతిన సాంకేతిక, ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించింది.

భవిష్యత్తు అవసరాలకు భరోసా

గల్ఫ్ రీజియన్‌లో దాదాపు 2,500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల భారీ సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. ఈ పైప్‌లైన్ కేవలం ఒమన్‌కే పరిమితం కాకుండా, భవిష్యత్తులో యూఏఈ, సౌదీ అరేబియా, కతార్ , ఇరాన్ వంటి గ్యాస్ సంపన్న దేశాలతో కూడా అనుసంధానించబడే అవకాశం ఉంది.

ఈ అండర్ వాటర్ పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావడానికి 5 నుండి 7 ఏళ్ల సమయం పట్టవచ్చు. ఇది పూర్తయితే భారత్ ఇంధన రంగంలో తన పరాయి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే కాకుండా గ్లోబల్ ఎనర్జీ పాలిటిక్స్‌లో కీలక శక్తిగా అవతరిస్తుంది. పర్యావరణ హితమైన సహజ వాయువు వినియోగాన్ని పెంచి, 2070 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ప్రాజెక్ట్ వెన్నెముకగా నిలవనుంది.

Tags:    

Similar News