సత్తా చాటిన చాట్ జీపీటీ.. జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్లో ఆలిండియా 4వ ర్యాంక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మేధస్సును అందుకుంటున్న మరో అద్భుత సంఘటన వెలుగులోకి వచ్చింది.;

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మేధస్సును అందుకుంటున్న మరో అద్భుత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సంస్థ సరికొత్త చాట్బాట్ అయిన చాట్జీపీటీ ఓ3, జేఈఈ అడ్వాన్స్డ్ 2025 మాక్ టెస్ట్లో 360 మార్కులకు గాను ఏకంగా 327 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మార్కులు చాట్జీపీటీ ఓ3కి ఆల్ ఇండియా ర్యాంక్ 4ను సూచిస్తాయి. ఇంజనీర్లుగా మారాలనుకునే విద్యార్థులకు భారతదేశంలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం అని భావించే పరీక్షల్లో ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఒకటి.
ఐఐటీ ఖరగ్పూర్లో గ్రాడ్యుయేట్ అయిన అనుష్క ఆష్వి చాట్జీపీటీ ఓ3తో ఒక ప్రయోగం చేసింది. మాక్ టెస్ట్ను పరిష్కరించమని చాట్జీపీటీ ఓ3కి ప్రశ్నలు ఇచ్చింది. ఫలితాలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పరీక్షను నిజంగా నిష్పక్షపాతంగా ఉండేలా చూసుకోవడానికి, అనుష్క చాట్జీపీటీ ఓ3కి ఒక సూచన ఇచ్చింది.. "ఐఐటీ విద్యార్థిలా ఆలోచించి పరీక్షను రాయుము" అని కోరింది. అంతేకాకుండా గూగుల్ సెర్చ్ లేదా పైథాన్ వంటి ఇతర సాధనాల నుంచి ఎటువంటి సహాయం తీసుకోకూడదని కూడా చాట్బాట్ను సూచించింది.
మాక్ టెస్ట్ను చాట్జీపీటీ ఓ3తో పరిష్కరించేటప్పుడు.. అనుష్క ప్రతి ప్రశ్నను కొత్త చాట్ సెషన్లో అడిగింది. అదనంగా, మాక్ టెస్ట్ అంతటా ఎటువంటి సూచనలు లేదా దిద్దుబాట్లు ఇవ్వలేదు. ఇన్ని సూచనలను ఇచ్చినా కూడా చాట్జీపీటీ ఓ3 అద్భతమైన పర్ఫామెన్స్ అందించి అనుష్కను ఆశ్చర్యపరిచింది. మాథ్య్స్, కెమిస్ట్రీలో రెండవ దశలో అది 60కి 60 మార్కులు సాధించింది. ఫిజిక్స్ లో మాత్రం కొన్ని మార్కులు కోల్పోయింది.
సంక్లిష్టమైన కాలిక్యులస్, మల్టి ఎలిమెంట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వంటి కఠినమైన ప్రశ్నలను కూడా చాట్జీపీటీ ఓ3 అద్భుతంగా పరిష్కరించింది. ఒక మంచి జేఈఈ అభ్యర్థి ఎలాగైతే దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తారో, ఇది కూడా అదే పద్ధతిని పాటించింది. కెమిస్ట్రీలో కష్టమైన ప్రశ్నలను కూడా చాలా కచ్చితత్వంతో చేసింది. అయితే, చాట్జీపీటీ ఓ3కి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. గ్రాఫ్లు, వెర్నియర్ స్కేల్ వంటి చిత్రాలను చూసి అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలను పరిష్కరించడానికి ఇది ఇబ్బంది పడింది. అంటే, బొమ్మలు లేదా దృశ్యాలను విశ్లేషించడంలో దీనికి ఇంకా లోపాలు ఉన్నాయని తెలుస్తోంది.
గతంలో కొన్నేళ్ల క్రితం, చాట్జీపీటీ-4 ఇలాంటి పరీక్షలో దాదాపు 10,000వ ర్యాంకులో ఉండేది. కానీ ఇప్పుడు, చాట్జీపీటీ ఓ3 సాధించిన ఈ అద్భుతమైన విజయం విద్యారంగంలో కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో స్పష్టం చేస్తుంది. ప్రతి సంవత్సరం, 15 లక్షల మందికి పైగా విద్యార్థులు ఐఐటీలలో చేరడానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తారు. ఇందులో కేవలం 17,000 మంది మాత్రమే సెలక్ట్ అవుతారు. అలాంటి కఠినమైన పరీక్షలో చాట్జీపీటీ ఈ స్థాయిలో ప్రతిభ చూపడం, ఏఐ భవిష్యత్తులో విద్యారంగంలో పెద్ద విప్లవం తీసుకురాగలదని సూచిస్తుంది.