లేటెస్ట్ స‌ర్కార్ స‌ర్వే: ఇదొక్క‌టే తార‌క‌మ‌త్రం.. !

ఏపీలో తాజాగా మ‌రోసారి ఐవీఆర్ ఎస్ స‌ర్వే జ‌రిగిందా? ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను మ‌రోసారి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారా? వారి అభిప్రాయాల‌ను దూసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

Update: 2026-07-23 10:02 GMT

ఏపీలో తాజాగా మ‌రోసారి ఐవీఆర్ ఎస్ స‌ర్వే జ‌రిగిందా? ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను మ‌రోసారి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారా? వారి అభిప్రాయాల‌ను దూసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. పార్టీ ప‌రంగా కాదు.. ఈ సారి కూడా స‌ర్కారు ప‌రంగానే స‌ర్వే సాగింద‌ని చెబుతున్నారు. పార్టీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. గ‌త మే-జూన్ నెల‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల మంది నుంచి ప్ర‌భుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ప్ర‌ధానంగా ఇది స‌ర్కారు విజ‌యంపైనే సాగింద‌ని చెబుతున్నారు.

మొత్తంగా 5 అంశాల‌పై ఈ ద‌ఫా ఐవీఆర్ ఎస్ స‌ర్వే సాగింద‌ని నాయ‌కులు తెలిపారు.

1) ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు: వీటిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్న స‌ర్కారు.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ‌గానే ఇస్తున్నారు. అలాగే.. అన్ని వ‌ర్గాల‌కు కూడా మేలు చేస్తున్నారు.

2) అన్న క్యాంటీన్లు: గ‌త వైసీపీ ప్ర‌భుత్వం నిలిపివేసిన దీనిని తాజాగా కొన‌సాగిస్తున్నారు. ఇది అనేక వేల మందికి మేలు చేస్తోంది.

3) ప‌రిపాల‌న‌: క్షేత్ర‌స్థాయిలో కార్యాల‌యాల‌కు వెళ్లే అవ‌స‌రాన్ని దాదాపు త‌ప్పిస్తూ..వాట్సాప్ పాల‌న‌ను తీసుకువ‌చ్చారు.

4) గ్రామీణాభివృద్ధి: ప్ర‌స్తుతం గ‌త రెండేళ్ల‌లో గ్రామీణ ప్రాంతాల్లో భారీ అభివృద్ధి జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌రుగుతోంది కూడా. ఇలా.. ఈ నాలుగు అంశాల‌ను స‌ర్వేల్లో తీసుకున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల ప‌నితీరు, స్థానిక నాయ‌కుల ప‌నితీరుపై స‌ర్వేలు జ‌రిగినా.. ఇంత విస్తృత స్థాయిలో ప్ర‌భుత్వ ప‌నితీరుపై స‌ర్వే జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి అనేది నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, చివ‌రిగా.. 5వ అంశం.. కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల స్పంద‌న‌. ఇదే అత్యంత కీల‌క‌మ‌ని చెబుతున్నారు.

దీనిపై ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న ల‌భించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మిగానే వెళ్లాల‌ని కోరుకుంటున్న వారి సంఖ్య 89 శాతం వ‌ర‌కు ఉంద‌ని స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. గ‌త కొన్నాళ్లుగా ఇదే మాట ఇటు నాయకులు కూడా చెబుతున్నారు. కూట‌మిగా ఉంటేనే మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు. తాజాగా ప్ర‌జల నుంచి కూడా అదే అభిప్రాయం వెల్ల‌డి కావ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఇప్పుడు మ‌రింత జోరుగా కూట‌మి ఐక్య‌త‌నే తార‌క‌మంత్రంగా ప‌ఠించ‌నున్నారు.పార్టీల‌లో ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్న‌ప్ప‌టికీ.. కూట‌మి ఐక్య‌త‌కే ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. సో.. మొత్తంగా ఇప్ప‌టి కంటే కూడా.. కూట‌మి ఐక్య‌త‌కు ఇక నుంచి మ‌రింత ఇంపార్టెన్స్‌తోపాటు.. మ‌రింతగా క‌లివిడి త‌నానికి ప్ర‌భుత్వం ప‌రంగా కూడా ప్రాధాన్యం ద‌క్క‌నుంది.

Tags:    

Similar News