డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు.. మంత్రులపై బొత్స ఫైర్

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని తాము ప్రశ్నలు అడిగితే వ్యంగ్యంగా సమాధానాలు చెబుతున్నారని బొత్స మండిపడ్డారు.;

Update: 2025-09-18 18:57 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. యథావిధిగా ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీని బహిష్కరించగా, మండలిలో మంత్రుల సమాధానాలను జీర్ణించుకోలేని వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు చాలా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు ఇచ్చారని ఎమ్మెల్సీ బొత్స ఆరోపించారు. అందుకే తాము మండలి సమావేశాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ మంత్రులు సమాధానాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఒక ప్రశ్న అడిగితే ఇంకేదో సమాధానం చెబుతున్నారని విమర్శించారు.

50 ఏళ్లకే పింఛన్ అన్నారని ప్రశ్న వేస్తే, దానికి సమాధానం లేదని బొత్స మండిపడ్డారు. ఒక ప్రశ్న వేస్తే ఏవేవో సమాధానాలు చెబుతున్నారని బొత్స విమర్శించారు. మద్యం అమ్మకాల మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారన్నారు. కల్తీ మద్యం, బెల్టు షాపుల విషయంలోనూ అర్థం లేని మాటలు చెప్పినట్లు బొత్స ఆరోపించారు. తిరుపతి, సింహాచలం దేవస్థానాల్లో జరిగిన రెండు దుర్ఘటనల గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేదని విమర్శించారు. దానికి కూడా జగన్ వచ్చి హడావిడి చేశారని రివర్స్ లో వాదంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని తాము ప్రశ్నలు అడిగితే వ్యంగ్యంగా సమాధానాలు చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. దేవస్థానాల్లో జరిగిన ఆ రెండు ఘటనలకు బాధ్యులు లేరా? చర్యలు తీసుకోరా? దాని మీద మాట్లాడరా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేనందున వాకౌట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

దేవాలయాల భద్రత విషయంలో మాట్లాడినప్పుడు ఎంత హుందాగా ఉండాలంటూ హితవుపలికారు. ఈ ప్రభుత్వానికి దేవుడితో పనిలేదని, భక్తుల మనో భావాలతో పనిలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలపై అడిగితే తాము చర్చకు అంగీకరించలేదా అని ప్రశ్నించారు. మండలిలో జరిగే ప్రతి చర్చ కూడా ప్రజలకు మంచి చేకూర్చేలా ఉండాలని కానీ, మండలిలో ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News