అచ్చెన్నాయుడి 'హవా'.. సైలెంట్గా సాగిపోతోందే.. !
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు .. సీనియర్ నేత అనే విషయం తెలిసిందే.;
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు .. సీనియర్ నేత అనే విషయం తెలిసిందే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నుంచి వరుస విజయాలు కూడా దక్కించుకున్నారు. గతంలో ఏపీ టీడీపీ చీఫ్గా కూడా పనిచేశారు. అయితే.. ప్రస్తుత సర్కారులో ఆయనకు హోంశాఖపై మనసుంది. కానీ, సామాజిక సమీకరణల్లో భాగంగా చంద్రబాబు ఈ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. దీంతో అచ్చెన్న ఆశలు పెద్దగా పట్టాలెక్కలేదు.
ప్రస్తుతం వ్యసాయ మంత్రిగా ఆయన సర్దుకుపోతున్నారు. మనసులో మాత్రం హోం శాఖ దక్కితే బాగుండేది! అనే వాదన ఉంది. దీంతోగత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న అచ్చెన్నవ్యవహారంపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఆయనను సంతృప్తి పరిచేలా.. అడిగింది చేస్తున్నారు. దీనిలో తప్పులేదు. అయితే.. తాము అడిగిన పనులు జరగడం లేదని కొందరు వాదిస్తున్నా.. అచ్చెన్న సీనియార్టీని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఆయన కోరినపనులు చేస్తున్నారు.
ఇటీవల శ్రీకాకుళం మునిసిపాలిటీలో కల్తీ పాల ఘటన జరిగింది. దీంతో అక్కడి మునిసిపల్ కమిషనర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ.. అచ్చెన్న క్షేత్రస్థాయిలో దీనిపై విచారణ చేయించారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన అక్కడే ఉండి విచారించారు. కల్తీపాల ఘటనకు.. కమిషనర్కు సంబంధ లేదని తెలుసుకున్న ఆయన.. వెంటనే సర్కారుకు నివేదిక ఇచ్చారు. కమిషనర్ విధుల్లో చేరిన నాలుగు రోజుల్లోనే ఘటన జరిగిందని.. ఆయనకు దీనికి సంబంధం లేదని పేర్కొన్నారు.
దీంతో సర్కారు.. సస్సెండ్ చేసిన కమిషనర్ను తిరిగి వారంలోనే అక్కడ నియమించింది. ఇక, రాష్ట్రంలో ఉన్న ఏడు రీజియన్లకు గాను... ఐదు రీజియన్లకు ఒక అధికారిని ఇంఛార్జ్ గా నియమిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొంత ఆసక్తికర పరిణామం. వాస్తవానికి ఒక రీజియన్కు ఒక అధికారిఉంటారు. కానీ, ఐదు రీజియన్లకు ఒకే ఒక అధికారిని నియమించడం గమనార్హం. దీనికి కారణం.. సదరు అధికారి కె. ప్రభాకర్ గురించి అచ్చెన్నకు బాగా తెలిసి ఉండడమే. ఆయన నిజాయితీ.. పనితీరుపై అచ్చెన్న ఇచ్చిన నివేదిక ఆధారంగా కె. ప్రభాకర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలా.. తన దైన శైలిలో అచ్చెన్న దూసుకుపోతున్నారు.